ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్కు షాక్ ఇచ్చిన కవిత
తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని కవిత విజ్ఞప్తి
తెలంగాణ జాగృతి కార్యాలయంలో కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఈ ప్రక్రియలో కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాము కూడా సామాజిక తెలంగాణ కోసం ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సామాజిక తెలంగాణ కోసం లెప్ట్ వింగ్, రైట్ వింగ్ నాయకులు, మేధావులను కలుస్తామన్నారు. సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని తెలంగాణ సమాజాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. మూడోసారి గెలిస్తే కేసీఆర్ సామాజిక తెలంగాణ చేసే వారని కవిత అన్నారు. ఆయన అజెండాను జాగృతి ద్వారా ముందుకు తీసుకెళ్తామన్నారు.
కేసీఆర్కు షాక్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేసీఆర్కు కవిత షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ మద్దతివ్వని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి కవిత మద్దతు పలికారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డగా భావించాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఎంతో అవగాహన ఉన్నఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికే వన్నె తెస్తారన్నారు. ఎన్నికల కమిషనర్గా టీఎన్ శేషన్ గతంలో ఆ పదవికి ఎలా వన్నె తెచ్చారో జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఆ విధంగా పదవికి వన్నె తెస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.
రేవంత్ అవినీతిని ప్రశ్నిస్తాం
కాళేశ్వరం కూలిందన్న రేవంత్ రెడ్డి…అదే ప్రాజెక్ట్లోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు ఎలా తెస్తున్నారని కవిత ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్లో రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెస్తే రూ.1,500 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని గుర్తు చేశారు. కానీ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామంటూ రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. మెఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టేందుకు రేవంత్ సహకరిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ విలువ రూ. 7,500 కోట్లకు ఎందుకు చేరిందో చెప్పే వరకు ప్రశ్నిస్తామన్నారు.
ప్రజల్లో స్ఫూర్తి నింపిన కాళోజీ, చాకలి ఐలమ్మ
కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కవిత నివాళులు అర్పించారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగాను ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలను కదలించిన కవి కాళోజీ అని అన్నారు. పుట్టుక నీది, చావు నీది బతుకంతా తెలంగాణది అని ఆయన మనలో స్ఫూర్తి నింపారని గుర్తుచేశారు. కవికి మరణం ఉండదనీ, కాళోజీ అనుసరించిన విలువలు, కవిత్వం ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకునేలా చేస్తున్నాయన్నారు. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. అలాంటి వీరత్వం తెలంగాణ రక్తంలోనే ఉందనీ,.చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు కదలాలని సూచించారు. సమావేశంలో ప్రముఖ కవులు, రచయితలు ఉషారాణి, డాక్టర్ కాంచనపల్లి, డాక్టర్ చమన్ సింగ్, లక్ష్మీ నారాయణ, తిరుమల శ్రీనివాస్ ఆర్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES