Wednesday, July 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

- Advertisement -

– పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– కోటపల్లి ప్రాజెక్టు అభివృద్ధికి రూ.90 కోట్లు : స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌
– 75 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే.. : పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
– తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-తాండూరు

ప్రజా సమస్యలు పరిష్కరించడమే నాయకుడి లక్ష్యమని, ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం రూ.275 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.250 కోట్లతో చేపట్టే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, రూ.25 కోట్లతో తాండూర్‌ పరిధిలో ఆరు 33/11 కెవి సబ్‌ స్టేషన్లు, పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. లబ్దిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. అనంతరం కందనెల్లి జీపీఆర్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల కుటుంబాలకుగాను 95 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికీ మొదటి విడతగా 3,500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. 25 ఎకరాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పాఠశాలలు భవిష్యత్‌ తరాలకు ఎంతగానో దోహదపడుతా యని చెప్పారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు అందజేశామన్నారు. ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణాలు అందించిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. లోవోల్టేజ్‌ సమస్య పరిష్కారానికి విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జనాభా ప్రాతిపదికన బహుజనుల రిజర్వేషన్‌ 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రానికి పంపించామన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.
స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కోటపల్లి ప్రాజెక్టు అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్‌ కార్డు ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో 75 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. వికారాబాద్‌ నుంచి తాండూర్‌ వరకు రూ.63 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్‌ జిల్లాలో కొత్తగా 22,503 రేషన్‌ కార్డులు మంజూరైనట్టు తెలిపారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కావాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డి, తాండూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హార్స్‌ చౌదరి, ఎలక్ట్రిసిటీ ఎస్‌సీ రవి కుమార్‌, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -