– దేశవ్యాప్తంగా కార్మికవర్గంపై ముప్పేట దాడి
– కార్మికులను బానిసలుగా మార్చేందుకే లేబర్కోడ్లు
– పాలకులు విధానాలను ఎండగట్టి కార్మికులను చైతన్యపరుస్తాం
– వలస కార్మికుల హక్కుల పరిరక్షణపై కేంద్రీకరణ
– కనీస వేతన జీవోల సాధనలో విజయం సాధిస్తాం
– ఆర్టీసీలో యాజమాన్య అప్రజాస్వామ్య విధానాలు సరిగాదు
– ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఐక్యంగా ముందుకెళ్తేనే మనుగడ
– దేశ ప్రయోజనాల కోసం జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నవతెలంగాణతో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
‘ఐక్యతాపోరాటం నినాదంతో సీఐటీయూ పనిచేస్తున్నది. దేశంలోని కార్మికవర్గాన్ని ఐక్యం చేసి దోపిడీలేని సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా సీఐటీయూ ముందుకు సాగుతున్నది. ఆ దిశగా సాగే పోరాటాలకు ఎన్వి. భాస్కర్రావు భవనం అడ్డా కాబోతున్నది. దేశవ్యాప్తంగా మోడీ సర్కారు పాలనలో కార్మిక వర్గంపై ముప్పేట దాడి పెరుగుతున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ సర్కారు వచ్చినా కార్మికవర్గం పట్ల పాలకులు విధానాలు మాత్రం మారలేదు. తాము అధికారంలోకి వస్తే కార్మిక యూనియన్లను పునరుద్ధరిస్తామన్న విషయంలో కాంగ్రెస్ సర్కారు మాట తప్పింది. యాజమాన్య కొత్తకొత్త చర్యలతో ఆర్టీసీలో అప్రజాస్వామ్య రాజ్యమేలుతున్నది. కనీస వేతనాల జీవోల జారీ విషయంలో మోసపూరిత విధానాలను ఆమలు చేయాలని చూసింది. రాష్ట్రంలో వలస కార్మికుల చట్టాలు ఎక్కడ కూడా అమలు కావడంలేదు. బతకడానికి వచ్చి ఇక్కడ ‘చితి’కిపోతున్నారు. సీఐటీయూగా కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేస్తున్నాం. స్కీమ్ వర్కర్లకు గౌరవ వేతనాలు పెరగడం సీఐటీయూ పోరాటాల ఫలితమే. కార్మికులను బానిసలుగా మార్చేందుకు మోడీ సర్కారు తీసుకురాబోతున్న లేబర్కోడ్లను వ్యతిరేకంగా ఐక్యకార్యాచరణను రూపొందించి పోరాటాలను ముందుకు తీసుకెళ్తాం’ అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఎన్.వి.భాస్కర్రావు స్మారక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన నవతెలంగాణకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తివివరాలు ఆయన మాటల్లోనే..
కనీస వేతనాల జీవోలు సాధిస్తాం…
రాష్ట్రంలోని 73 షెడ్యూల్ పరిశ్రమల్లో ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావడం లేదు. దీంతో కోటీ 20 లక్షల మంది కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐదేండ్లకోసారి సవరించాల్సిన జీవోలను 15 ఏండ్లు అయినా ముట్టని దుస్థితి. కనీసవేతనాల జీవోలను సవరిస్తే ప్రభుత్వం మీద పైసా భారం పడదు. పెట్టుబడిదారుల మీద ఆర్థిక భారం పడుతుందనీ, లాభాలు తగ్గి వారి ప్రయోజనాలకు నష్టం జరుగుతుందనే భావనలో పాలక పార్టీలున్నాయి. పెట్టుబడిదారుల దోపిడీకి పాలకులు తొత్తులుగా వ్యవహరిం చడాన్ని కార్మికవర్గంలో ఎండగట్టుతాం. కార్మికులకు వేతనాలు పెరగకుండా, వారి జీవితాలు బాగుపడకుండా ఈ దేశం అభివృద్ధి సాధ్యం కాదు. కార్మికుల కొనుగోలు శక్తి పెరగాలంటే కనీస వేతనాలు పెరగాలి. ఎన్నికల ముందు కనీసవేతనాలు సవరిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అధికారంలోకి వచ్చాక పాత జీతాలకు డీఏ కలిపి వేతనాలు పెంచినట్టు చూపి మోసపూరిత పద్ధతులను అవలంబించింది. ఇది దారుణం. కనీస వేతనాల సవరణ కోసం ప్రత్యేక ఉద్యమం చేపట్టబోతున్నాం. అంతిమంగా విజయం సాధిస్తామనే ఆశాభావం మాలో ఉంది.
ఆర్టీసీలో అప్రజాస్వామ్య విధానాలు
దేశవ్యాప్తంగానూ కార్మికుల హక్కుల మీద, చట్టాలమీద, యూనియన్ల కార్యకలాపాల మీద తీవ్ర నిర్బంధాన్ని పాలకులు కొనసాగిస్తున్నారు. తెలంగాణ లోనూ దానికి భిన్నంగా ఏమీ లేదు. ఆర్టీసీలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యూని యన్ కార్యకలాపాల నిషేధం విధిం చింది. తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీలో యూని యన్లను, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని గొప్పగా చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నది. అక్కడ నేటికీ అప్రజాస్వా మ్యమే రాజ్యమేలుతున్నది. బీఆర్ఎస్ పెట్టిన నిర్బం ధాన్ని ఎత్తేయలేదు. పైగా, ఆర్టీసీలోని యూనియన్ యాక్టివిస్టులపై నిర్బంధం విధిస్తున్నది. ఆర్టీసీలోని ట్రబుల్ షూటర్ల(కార్మికుల హక్కుల గురించి మాట్లాడేవారు, యాజమాన్య విధానాలను ప్రశ్నించేవారు)పై యాజమాన్యం నిఘా పెట్టింది. ఆ లెక్కలు తీయాలని సీఎండీ ఆదేశించారు. మరోవైపు ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను, డ్రైవర్లను నియమించాలనే ఆలోచన దుర్మార్గం. ఆర్టీసీలో పోరాటాన్ని ఉద్యోగుల వేతనాల సమస్యగా చూడొద్దు. అది ప్రజారవాణా వ్యవస్థ. దాన్ని రక్షించుకోవాలి. ఆర్టీసీలోని విధానపరమైన సమస్యల పరిష్కారం కోసం కార్మికసంఘాలన్నీ ఐక్యం కావాలి. ఆర్టీసీలో కార్మిక సంఘాలు రెండు జేఏసీలుగా చీలిపోవడం కార్మికవర్గానికే నష్టదాయకం. అందరూ ఏకం కావాలి. జేఏసీలు శాశ్వతంగా ఉండవు. సమస్యల ప్రాతిపదికన జేఏసీలు ఉండాలి. కార్మికులకు విశ్వాసం కలిగించేలా జేఏసీ యాక్టివిటీ ఉండాలి. అప్పుడే పాలకవర్గాలు, యాజమాన్యం దిగొస్తాయి. సీఐటీయూ అనుబంధ సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ ఏ జేఏసీలోనూ లేదు. ఎందుకంటే ఇద్దరూ రెండు గా విడిపోయి రెండు సంఘాలు చెలమణి కావడం సరిగాదు. అందర్నీ కలిపే ప్రయత్నం ఎస్డబ్ల్యూఎఫ్ చేస్తున్నది. అందరూ ఒకే జేఏసీ ఏర్పడి ఐక్య పోరాటం చేసే రోజు వస్తుందని ఆకాంక్షిస్తున్నాం.
స్కీం వర్కర్లకు అండగా ఉన్నాం..విజయాలు సాధించాం
సీఐటీయూ ప్రభుత్వ పథకాల్లో పనిచేసే స్కీం వర్కర్లకు అండగా ఉన్నాం. రాష్ట్రంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ వీఓఏ, మెడికల్ విభాగం, ఉపాధి హామీ తదితర స్కీమ్లలో మూడు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పాలకులు వారితో పొద్దస్తమానం పనిచేయించి గౌరవ వేతనాలనే ఇస్తున్నారు. పైగా, రాజకీయ వేధింపులు మితీమీరిపోయాయి. వాటన్నింటిలోనూ సీఐటీయూ సంఘాలు పెట్టి అనేక విజయాలు సాధించింది. మినీ అంగన్వాడీలు శ్రమదోపిడీకి గురయ్యారు. నిరంతర పోరాట ఫలితంగా వారిని ప్రభుత్వం మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించింది. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.1000 గౌరవ వేతనం మాత్రమే వచ్చేది. అనేక పోరాటాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రెండు వేలు కలిపి రూ.3 వేలు ఇస్తున్నది. ఐకేపీ వీఓఏలకు ప్రాజెక్టు ద్వారా డబ్బులు ఇప్పించాం. ఫీల్డు అసిస్టెంట్లను పోరాటాలు చేసి తిరిగి ఉద్యోగాలిప్పించాం. ల్యాబ్ టెక్నీషియన్లు, 104 సిబ్బంది యూనియన్ల పోరాటాల ద్వారానే వేతనాలు పెరిగాయి.
కార్మిక ఐక్యత కోసం నిరంతర కృషి
రాబోయే రోజుల్లో సమస్యల్ని అధ్య యనం చేస్తాం. ఎన్విబి కేంద్రంగా ఆ సమస్యల ప్రాతిపదిక కార్యాచరణ రూపొం దిస్తాం. డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులను చైతన్యపరుస్తాం. నయాఉదార విధానాలను ప్రతిఘటిస్తాం. ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పన కోసం కృషి చేస్తాం. కార్మికవర్గ ఐక్యత కోసం నిరంతరం పనిచేస్తాం. ఆర్థిక చైతన్యానికే పరిమితం కాకుండా సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కూడా కార్మికుల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.
వలస కార్మికుల హక్కుల పోరాటాలపై కేంద్రీకరణ
వలస కార్మికులవి బానిస బతుకులు. తెలంగాణలోని పరిశ్రమలు, ప్రాజెక్టుల్లో అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎస్ఎల్బి టన్నెల్ నిర్మాణంలో ఇంజినీర్లతో సహా వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. షాద్నగర్ సమీపంలో సౌత్గ్లాస్ కంపెనీలో ప్రమాదం జరిగి రియాక్టర్ పేలి ఏడుగురు చనిపోయారు. భువనగిరి జిల్లాలో ప్రీమియర్ ఎక్స్పోజర్ పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు అదే పరిశ్రమలో మరో కార్మికుడు చనిపోయాడు. జవహర్ నగర్ డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్త నుంచి విద్యుత్ తయారీ చేసే ప్లాంటులో ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయారు. వెలుగులోకి రానివి కోకొల్లలు. ఇలా అన్నిచోట్లా వలస కార్మికులే పనికోసం వచ్చి చితికిపోతున్నారు. ఘటనలు వెలుగులోకి వస్తే శవాలను బయటకు తీస్తున్నారు..లేకుంటే గుట్టుగా కాల్చేస్తున్నారు. లేదంటే దొడ్డిదారిన సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అనారోగ్యమని చిత్రీకరిస్తున్నారు. ఇది దారుణం. మరణించిన కార్మికులను ఆదుకునే పరిస్థితి లేదు. క్షతగ్రాతులను వైద్యం అందించే పరిస్థితి లేదు. 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం అమలు కావడం లేదు. వలస కార్మికులు ఎక్కడ నుంచి వస్తున్నారు? పనిప్రదేశాల్లో సౌకర్యాలున్నాయా? లేదా? రిజిష్ట్రర్ మెయింటెన్ చేస్తున్నారా? లేదా? ప్రమాదం జరిగితే ఎలా ఆదుకోవాలి? అనేవి ఏవీ పట్టించుకోవడం లేదు.
ఆర్టీఐ యాక్టు ద్వారా వలస కార్మికుల లెక్కలు అడిగితే ప్రభుత్వం లేని దుస్థితి. వారి హక్కులపై దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని సీఐటీయూగా నిర్ణయించాం. ప్రత్యేకంగా కేంద్రీకరించి ఉద్యమాలు నిర్వహిస్తాం.
దేశ ప్రయోజనం కోసం జూలై 9న సమ్మె
కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తున్నాం. లేబర్ కోడ్ల రద్దు కోసం దేశవ్యాప్తంగానూ పోరాటాలు జరుగుతున్నాయి. గత సమ్మెలకు భిన్నంగా అనేక రెట్ల ఉత్సాహంతోని, బహుముఖ పద్ధతుల్లో కార్మికులను మే 20 సమ్మెకు సన్నద్ధం చేశాం. సమ్మె కార్మికుల ఆర్థిక ప్రయోజనాల కోసమే కాదు దేశ ప్రయోజనాల కోసమనీ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమని కార్మికవర్గంలోకి తీసుకెళ్లాం. కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం. యుద్ధంలో అనేక మంది సైనికలు చనిపోయారు. సరిహద్దు రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమ్మె భావ్యం కాదని జూలై 9కి వాయిదా వేశాం.
దోపిడీలేని సమసమాజమే కార్మికోద్యమ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES