వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష
నవతెలంగాణ – కంఠేశ్వర్ : క్షయ వ్యాధి నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష జరిపారు. క్షయ, హెచ్ఐవీ నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకుని, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు క్షయ వంటి వ్యాధులను నివారించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, క్షయ, హెచ్ఐవీ వ్యాధుల నిర్ధారణ కోసం విరివిగా శాంపిల్స్ సేకరించాలని సూచించారు. టీ.బీ సోకినట్లు నిర్ధారణ అయిన వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం టీ.బీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీ.బీ నియంత్రణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి, నిజామాబాద్ ను టీ.బీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ హితవు పలికారు. వైద్య పరీక్షలలో పాజిటివ్ వచ్చిన వారికి చికిత్సలు అందించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితంగా మెలిగిన వారికి కూడా పరీక్షలు జరపాలని, తద్వారా ఒకరి నుండి మరొకరికి ఈ వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టేండేందుకు వీలవుతుందని అన్నారు. ప్రతి రోజు కనీసం రెండు గ్రామాలలో అవగాహాన కార్యక్రమాలు, శాంపిల్స్ సేకరణ జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా క్షయ వ్యాధి సోకేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. శాంపిల్స్ సేకరణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్ణీత గడువు లోపు లక్ష్యానికి మించి శాంపిల్స్ సేకరించేలా ఒక్కో ఆరోగ్య కేంద్రం వారీగా లక్ష్యాలు విధిస్తూ, వాటిని పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. క్షయ వ్యాధి, హెచ్ఐవీ నియంత్రణ కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, సాధించిన ప్రగతిని వివరిస్తూ సమగ్ర నివేదికలు సమర్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ దేవి నాగేశ్వరీ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధి నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES