– రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– రైతుల బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం?
– మక్కల రాసుల పరిశీలన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి క్వింటాలుకు రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అదనంగా రూ.400 ఇచ్చి రూ.2800 లకు కొనుగోలు చేయాలన్నారు. మంగళవారం ఆయన బడా భీంగల్ నుండి వేల్పూర్ మండలం అక్లూర్ వెళ్లే దారిలో రోడ్ పై కిలోమీటర్ మేరా రాసులుగా పోసి ఉన్న మక్కలను పరిశీలించారు.అక్కడే ఉన్న రైతులతో ముచ్చటించారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టక ప్రవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు మక్కలు అమ్ముకోవడం వలన నష్టపోతున్నమని రైతులు ఎమ్మెల్యేతో తమ ఆవేదన వెలిబుచ్చారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ….ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే రైతుల దగ్గర మక్కలు క్వింటాలకు రూ.2800 పోవాలన్నారు.ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోయేసరికి దళారులకు రూ.1600 లకే రైతు అమ్మేసుకుంటున్నాడన్నారు.ప్రతి రైతుకు క్వింటాలుకు సుమారు రూ.1000 చొప్పున రైతు నష్టపోతున్నాడన్నారు.ఒకరైతు ఎకరాకు 30 క్వింటాలు మక్కలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రవేట్ వ్యాపారులకు అమ్మి ఎకరాకు రూ.30వేలు నష్టపోతున్నాడని తెలిపారు.
రైతులు పంటను సరైన ధరకు అమ్ముకోలేక నష్టపోతు బాధపడుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.రైతుల బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం అన్నారు.ఇప్పటికే ప్రతి సింగిల్ విండో ద్వారా ఊరురా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేశానని,అయినా ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో చలనం లేదన్నారు.వర్షాలు పడుతున్నాయి మక్కలు ఫంగస్ వచ్చినట్లయితే ధర రాక రైతులు ఇంకా నష్టపోయే అవకాశం ఉందన్నారు.
ఇచ్చిన మాట ప్రకారమే రూ.2400 మద్దతు ధర ఉన్న మక్కలకు అదనంగా రూ.400 కలిపి క్వింటాలు మక్కలను రూ.2800 లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.వెంటనే ప్రతి ఊరురా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకుంటే ఈ రైతుల ఉసురు మీకు, ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందన్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2800 చెల్లించి కొనుగోలు చేసేవరకు బిఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.