– మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
– మిల్లా మ్యాగి ఆరోపణల్లో వాస్తవం లేదు : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మిస్వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డుతూ ఈ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.31 కోట్లు ఖర్చు చేసిందనీ, అందులో రూ.21 కోట్లు స్పాన్సర్ల ద్వారానే వచ్చాయని చెప్పారు. మరో రూ.12 కోట్లకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలున్నాయని గుర్తు చేశారు. వారు హామీ ఇచ్చిన మొత్తాన్ని చెల్తిస్తే సర్కార్పై నయాపైసా భారం పడబోదనీ, ఒక వేళ ఆ మొత్తం రాకుంటే రూ.10 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందని చెప్పారు. రూ.200 కోట్లు ఖర్చు చేశారన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను కొట్టి పారేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు 30తులాల బంగారం ఇచ్చారనేది అబద్ధమని పేర్కొన్నారు. పోటీదారులకు బంగారం, ఇతర బహుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ”మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఎక్కడ ఖర్చయ్యాయో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు చెప్పాలి. తెలంగాణ భవన్కు రావాలా? ఆబిడ్స్ చౌరస్తాకు రావాలా? ఆరోపణలు నిరూపించకుంటే ముక్కు నేలకు రాయాలి” అని మంత్రి జూపల్లి సవాల్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్లకే రూ.115 కోట్లకుపైగా ఖర్చు చేశారని తెలిపారు. ఇంత పెద్ద ఈవెంట్ను తక్కువ ఖర్చుతో ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. చౌమ హల్లా ప్యాలెస్ విందులో ఒక్కో ప్లేట్ భోజనానికి రూ.లక్ష ఖర్చు చేశారనేది అవాస్తమనీ, ఒక్కో ప్లేట్కు రూ.8,200 మాత్రమేనని స్పష్టం చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను మంత్రి జూపల్లి ఖండించారు. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదనీ, మిస్ ఇంగ్లాండ్ను ఇబ్బంది పెట్టారనేది వాస్తవం అయితే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకూ ఉండేవారు కాదని పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ పోటీలు విజయవంత మయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ హన్మంతు జండగే, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కె.లక్ష్మి పాల్గొన్నారు.
సర్కార్ ఖర్చు చేసింది రూ.31 కోట్లే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES