మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రైస్తవ మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో వైఎంసీఏ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మల్టీపర్పస్ ప్రోగ్రామ్ సెంటర్, కొత్త ఆడిటోరియానికి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ, క్రైస్తవ మైనార్టీలకు నిధులు, సంక్షేమ పథకాలు, పదవుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి వర్గానికి న్యాయం చేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. గత ప్రభుత్వాలు క్రిస్టియన్ల సమస్యలను విస్మరించాయనీ, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మైనార్టీల శ్మశాన వాటికలు, వాటికి కేటాయించిన భూముల సమస్యలను క్లియర్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆ భూములు కబ్జాలకు గురికాకుండా ఫెన్సింగ్తో రక్షణ కల్పించి, అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. బడ్జెట్ కేటాయింపుల్లో క్రైస్తవ మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తామని, పాస్టర్లకు, చర్చిలకు, సేవా సంస్థలకు తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం స్కాలర్ఫిప్ నిధులు పెంచి, ప్రత్యేక వసతులు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పేద క్రైస్తవ కుటుంబాలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, సబ్సిడీలు అందిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా వైఎంసీఏ చైర్మెన్గా సేవలందించిన మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ దీపక్ జాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి శాంతికుమారి, కార్పొరేటర్ కొంతం దీపిక, సుప్రీంకోర్టు న్యాయవాది జోర్సు, బిషప్ సింగం, లెనార్డ్ తదితరులు పాల్గొన్నారు.
క్రైస్తవ మైనార్టీల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES