– నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి
– రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి : ఫార్మా బాధిత రైతుల డిమాండ్
నవతెలంగాణ-యాచారం
ఫార్మా భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను గౌరవించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. గురువారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీ పరిధిలోని నాలుగు గ్రామాల రైతులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను ఆన్లైన్కి ఎక్కించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతు భరోసా మొత్తాన్ని రైతు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసే విధంగా సీఎం రేవంత్రెడ్డి పాలన ఉందని, ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో సమావేశమై కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
హైకోర్టు ఆర్డర్ను గౌరవించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES