భారత ప్రజాస్వామ్యానికి అదే పునాది
ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, సూత్రాలను
కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే : సీజేఐ బీఆర్ గవాయ్
ముంబయి: దేశంలో పార్లమెంటే సుప్రీం అని చాలామంది భావిస్తుంటారనీ, కానీ తన దృష్టిలో రాజ్యాంగమే అత్యున్న తమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. రాజ్యాంగం పరిధిలోనే భారత ప్రజాస్వామిక వ్యవస్థకు చెందిన శాసన, న్యాయ, కార్యనిర్వాహక శాఖలు పని చేస్తాయన్నారు. రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, దాని మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు మార్చలేదని చెప్పారు. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు ఇచ్చిన విషయాన్ని సీజేఐ గుర్తు చేశారు. గత నెలలోనే భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సీజేఐ గవాయ్ను మహారాష్ట్రలోని అమరావతి బార్ అసోసియేషన్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీజేఐ బీఆర్ గవాయ్ ప్రసంగిస్తూ న్యాయమూ ర్తుల పనితీరు, తన లా కెరీర్తో ముడిపడిన పలు కీలక విషయాలను వివరించారు. అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయనే విషయాన్ని జడ్జీలు గుర్తుంచు కోవాలని సీజేఐ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులను వెలువరించినంత మాత్రాన ఒక జడ్జీ స్వతంత్రుడు కాలేడని ఆయన చెప్పారు. ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, సూత్రాలను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉంటుందని అన్నారు. ప్రజలు ఏమనుకుం టారు అనే దాని ఆధారంగా జడ్జీలు తీర్పులను ఇవ్వకూడదన్నారు. రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కుల భావనకు అనుగుణంగా స్వతంత్రంగా తీర్పులను వెలువరించాలని జడ్జీలకు సీజేఐ బీఆర్ గవాయ్ సూచించారు. తాను ఇప్పటివరకు ఇచ్చిన తీర్పులన్నీ ఇదే కోణంలో ఉంటాయన్నారు. ప్రజలపై బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా తాను తీర్పు ఇచ్చానని, నిలువ
నీడ పొందే ప్రజా హక్కునే పరమావధిగా పరిగణించానని సీజేఐ తెలిపారు.
‘నాన్న కోరికను నెరవేర్చినందుకు గర్వంగా ఉంది’
బాల్యంలో తాను ఆర్కిటెక్ట్ కావాలని అనుకునే వాడినని, కానీ న్యాయవాది కావాలని తన తండ్రి దాదా సాహెబ్ గవాయ్ కోరుకునే వారని సీజేఐ బీఆర్ గవాయ్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి దాదాసాహెబ్ గవాయ్ కూడా న్యాయవాది కావాలని భావించారనీ, అయితే అప్పట్లో స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన అరెస్టయ్యారని ఆయన చెప్పారు. లాయర్ కావాలనే తన తండ్రి కోరికను నెరవేర్చినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తన తల్లి కూడా ఉండటం సంతోషాన్ని కలిగిస్తోందని, అయితే తాతగారిని చాలా మిస్ అవుతున్నానని తెలిపారు. తన పరిచయస్తులు, స్నేహితులు, ఉపాధ్యాయులను ఈ హాలులో చూస్తుంటే ఆనందంతో ఉప్పొంగుతున్నట్టు సీజేఐ పేర్కొన్నారు.
నాన్న మాట విన్నందుకు సంతోషంగా ఉన్నా
”2001లో నాకు న్యాయమూర్తి అయ్యే అవకాశం వచ్చింది. ఆ సమయంలో మా నాన్న నాతో ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తే చాలా డబ్బు సంపాదించొచ్చు. కానీ న్యాయమూర్తి అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక లక్ష్యాన్ని సాకారం చేయొచ్చని మా నాన్న అన్నారు. నాన్న మాటల ప్రకారం నడుచుకోవడం వల్ల నేను సంతోషంగా ఉన్నాను” అని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
‘అప్పట్లో అలాంటి వాళ్లు లా కోర్సులో చేరేవారు’
”నేను లా చేసిన సమయంలో న్యాయ విద్య నేటిలా ఉండేది కాదు. కెరీర్పై క్లారిటీ లేని చాలామంది అప్పట్లో లా కోర్సులో చేరేవారు. ఆ రోజుల్లో నాతో పాటు లా చేసిన స్నేహితులు ఎప్పుడో ఒకసారి క్లాసులకు హాజరయ్యేవారు. వాళ్లంతా నాకు గుర్తున్నారు. కెరీర్లో నాకు గైడెన్స్ ఇచ్చిన వారిని, సన్నిహితులను మర్చిపోలేను. వాళ్లందరి సహకారం వల్లే నా లా కెరీర్ 40 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. 18 సంవత్సరాలు న్యాయవాదిగా, 22 సంవత్సరాలు న్యాయమూర్తిగా సేవలు అందించాను” అని సీజేఐ బీఆర్ గవాయ్ తెలిపారు.
సీజేఐ తల్లి కమల్ గవారుకు సన్మానం
అమ్రావతిలోని పోటే కళాశాలలో ఉన్న గ్రాండ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ నితిన్ సాంబ్రే అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్కు చెందిన జస్టిస్ ప్రవీణ్ పాటిల్, జస్టిస్ అనిల్ కిలోర్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అడ్వకేట్ సునీల్ దేశ్ముఖ్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సీజేఐ బీఆర్ గవాయ్ తల్లి కమల్ గవాయ్ను సత్కరించారు. సీజేఐ బీఆర్ గవాయ్తో పాటు ఆయన సతీమణి డాక్టర్ తేజస్వినినీ సత్కరించారు.
అత్యున్నతమైనది రాజ్యాంగమే
- Advertisement -
- Advertisement -