ముంబయి-గోవా మత్స్యకారుల జీవనోపాధిపై సంక్షోభం
ఇంధన ధరల పెరుగుదల, ఎల్పీజీ కొరతతో చేపల వేట తగ్గింపు
తీరానికే పరిమితమైన పడవలు
ప్రభుత్వం సబ్సిడీలు, ధరల నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలి : మత్స్యకార సంఘాల డిమాండ్
ముంబయి, గోవా : మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం, ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడటం వల్ల ముంబయి, గోవా ప్రాంతాల్లో మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతోంది. అనేక పడవలు సముద్రంలోకి వెళ్లకుండా తీరానికే నిలిచిపోతున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి తీవ్రంగా మారింది.మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం భారతదేశ తీర ప్రాంతాలపై పడింది. ముఖ్యంగా, ముంబయి, గోవా ప్రాంతాల్లో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజీల్ ధరలు భారీగా పెరగడం వల్ల చేపల వేటకు వెళ్లడం కష్టంగా మారింది. ఆర్థికంగా భారమైంది. పెద్ద పడవలు ఒక్క ట్రిప్నకు వేల లీటర్ల డీజీల్ వినియోగించాల్సి ఉండటంతో, ఖర్చులు అమాంతం పెరిగాయి. ఇంకా ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా పడవల్లో వంట కూడా కష్టంగా మారింది. బ్లాక్ మార్కెట్లో ఒక సిలిండర్ ధర రూ.10వేల వరకు పెరిగింది.
దీనితో అనేక మంది మత్స్యకారులు వేటకు వెళ్లే రోజుల సంఖ్యను తగ్గించారు. గోవాలో సుమారు 30 శాతం పడవలు తీరానికే నిలిచిపోయాయి. ముంబయిలో కూడా మత్స్యకారులు డీజీల్ ధరలు అధికంగా ఉండటంతో వేటకు వెళ్లడం ఆపేశారు. కొంత మంది చిన్న స్థాయిలో రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి డీజీల్ కొనుగోలు చేస్తూ తాత్కాలిక పరిష్కారం కనుగొంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చేపల సరఫరా తగ్గి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఏప్రిల్-మే నెలల్లో ఉండే ముఖ్యమైన వేట సీజన్ కూడా దెబ్బతింటోంది. జూన్-జులైలో ఉండే వేట నిషేధ కాలానికి ముందుగా నిల్వలు సమకూర్చుకోవాల్సిన సమయంలో ఈ సంక్షోభం మరింత సమస్యగా మారింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ధర నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మధ్యప్రాచ్య యుద్ధం దూర ప్రాంతమైన భారత్లో కూడా మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సమస్య త్వరగా పరిష్కారం కానట్టయితే.. ఈ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.



