తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ..
నవతెలంగాణ – భువనగిరి : భువనగిరిలో చేతి వృత్తిదారుల సంఘం భవనంలో జరిగిన జిల్లా ఆఫీసుబేరర్ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రధానంగా రజక వృత్తిదారుల సమస్యలు ఆరు డిమాండ్ల సాధన కోసం రేపు జూన్ 17న జరిగే ఇందిరాపార్క్ దగ్గర జరిగే ధర్నాకు రజకులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ పథకం బిల్లులు వేలల్లో పేరుకుపోయాయని ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచిన బిల్లు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కరెంటోల్లా బెదిరింపులకు రజకులు ఇబ్బందులకు గురవుతున్నారని వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాలో ప్రతి రజకుడు భాగస్వామ్యం కావాలని రజకుల హక్కుల కోసం సాధన కోసం తమ వంతు కృషిగా ముందడుగు వేయాలని, ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రజకులకు దోబీఘాట్ స్థలాలు, కమ్యూనిటీ హాల్ కేటాయించాలన్నారు. రజకులకు 50 సంవత్సరాలు వయసు వచ్చేసరికి నిలబడి ఇస్త్రీ చేయటం వల్ల కాళ్లు చచ్చి పడడంతో పాటు పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, కావున ప్రభుత్వం స్పందించి చేనేత,గీత వృత్తిదారులకు ఇస్తున్నట్లు పెన్షన్ 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ ఇవ్వాలన్నారు. రజకులకు రక్షణ చట్టం చేయాలని , ఉచిత విద్యుత్ పథకం ఎల్2 నుండి ఎల్ టి 4 గా మార్చాలని ,వృత్తిదారులకు రూ.5 లక్షల బీమా పథకం ఏర్పాటు చేయాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారం కోసం జిల్లా నుండి రజకులు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బాతరాజు దశరథ అధ్యక్షతన జరగగా,జిల్లా ఉపాధ్యక్షులు అవనగంటి స్వామి, వడ్డేమాన్ బాలరాజ్, జిల్లా సహాయ కార్యదర్శి వడ్డేమాన్ రవి,జిల్లా కమిటీ సభ్యులు వడ్లకొండ రమేష్, మండ్రా కోటయ్య, మెతుకు అంజయ్య పాల్గొన్నారు.