Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోషణ అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

పోషణ అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

– ప్రొఫెసర్‌ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో పోషణ అభియాన్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను పోషణ అభియాన్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పొనుగోటి సంపత్‌, కోదండరాం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ పొడిగింపు, జీతభత్యాల పెంపు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, మెటర్నిటీ సెలవుల తదితర అంశాలపై కోదండరాం చర్చించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలు పెంపుదలకు చర్యలు తీసుకోవాలనీ, కాంట్రాక్ట్‌ క్రమబద్ధీకరణను సమయానికి చేపట్టాలనీ, క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రభుత్వ పాలసీలు అమలు చేయాలని కోరారు. పని భారం తగ్గించి, మానసిక ఒత్తిడి తగ్గించేలా ఆధునిక సాంకేతిక పరికరాలు అందించాలని సూచించారు.
అనితా రామచంద్రన్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ విషయంలో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం జరిగిందనీ, త్వరలోనే పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. జీతభత్యాల పెంపునకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామనీ, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి అందజేస్తున్న సాంకేతిక సదుపాయాలను పోషణ అభియాన్‌ సిబ్బందికి కూడా విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో పోషణ అభియాన్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శులు నాగులవంచ సతీష్‌, శైలజ, సరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -