విజయవంతం చేయండి : సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో పిలుపు
న్యూఢిల్లీ : ఈ నెల 24న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సీపీఐ(ఎం) నిర్వహించే ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీని విజయవంతం చేయాలని పొలిట్బ్యూరో పిలుపునిచ్చింది. ఉత్తరభారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జరిగిన జన్ ఆక్రోశ్ జాతాల ముగింపు సందర్భంగా ఈ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల 20 మధ్య 33 జాతాలు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మొత్తం 213 రోజుల పాటు పర్యటించాయని వివరించింది. ఈ సందర్భంగా 1000కి పైగా బహిరంగ సభలు జరగ్గా, సుమారు లక్షా యాభై మంది ప్రజల హాజరైనట్టు పొలిట్బ్యూరో వెల్లడించింది.
అలాగే దాదాపు 35 వేల పుస్తకాలు అమ్ముడు కాగా, పది లక్షల కరపత్రాలు పంపిణీ చేసినట్టు వివరించింది. జాతాలతో పాటు సాంస్కృతిక బృందాలు కూడా పర్యటించి, జాతాల సమయంలో లేవనెత్తిన సమస్యలను హైలైట్ చేస్తూ వీధి నాటకాలు, పాటలను ప్రదర్శించినట్టు పేర్కొంది. నాలుగు లేబర్ కోడ్ల నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని, వీబీ- జీఆర్ఏఎంజీని రద్దు చేయాలని, విద్యుత్ చట్టాన్ని, విత్తన బిల్లును సవరించవద్దని, భారత్- అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జన్ ఆక్రోశ్ జాతాలు, ర్యాలీని నిర్వహిస్తున్నట్టు పొలిట్బ్యూరో వివరించింది.
ఈ జాతాల సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వపు విధానాలతో ప్రజలు పడుతున్న కష్టాల తీవ్రత మరోసారి వెలుగులోకి వచ్చిందని పొలిట్బ్యూరో విమర్శించింది. ఇరాన్పై అమెరికా- ఇజ్రాయిల్ దాడుల ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. వంటగ్యాస్, ఇంధన ధరల పెరుగుదల, గ్యాస్ సిలిండర్ల కొరత, పెరుగుతున్న ఆహార ధరలు, వ్యాపార సంస్థలు, వ్యాపారాలు పూర్తిగా లేదా పాక్షికంగా మూతపడటం వంటి సమస్యలు ప్రజల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. ఈ కష్టాలపై ర్యాలీ గళం వినిపిస్తుందని పొలిట్బ్యూరో పేర్కొంది. షహీది దివస్ జరిగిన మరుసటి రోజునే నిర్వహించనున్న ఈ ర్యాలీ కోసం ఉత్తరభార తదేశం నలుమూలల నుంచి ప్రజలను సమీకరిస్తున్నామనీ, ఈ ర్యాలీని ఉద్దేశించి సీపీఐ(ఎం) జాతీయ నాయకులు ప్రసంగిస్తారని, కార్యాచరణకు పిలుపునిస్తారని వివరించింది.



