Friday, May 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుచదువుల ఒడి.. సర్కారు బడి

చదువుల ఒడి.. సర్కారు బడి

- Advertisement -

– టీఎస్‌యూటీఎఫ్‌ ప్రభుత్వ స్కూల్స్‌ పరిరక్షణ యాత్ర
– మన పిల్లలను మన ఊరి బడిలో చేర్పించాలని పిలుపు
– ఫీజుల భారంలేని ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం
– పేరెంట్స్‌ను ఆకట్టుకునేలా ఊరూరా ప్రచారం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు టీఎస్‌ యూటీఎఫ్‌ పూనుకుంది. మన పిల్లలను మన ఊరిబడిలో చేర్పించాలనే పిలుపుతో ఈ యాత్ర చేపట్టింది. చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నా.. సర్కారు బడిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించకపోవటం ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలకు వరంలా మారింది. వేలాది మందిలో కొద్దిమంది ప్రతిభను చూపించి ప్రయివేటు పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయి. విపరీతమైన ప్రచార ఆర్భాటం.. పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకొని కార్పొరేట్‌, ప్రయివేటు స్కూల్స్‌ చేస్తున్న హడావుడితో ఆర్థికస్తోమత సరిపోకపోయినా అప్పుచేసి మరీ పేరెంట్స్‌ వీటిలోనే చేర్పిస్తున్నారు.
ప్రచార ఆర్భాటంతో ‘ప్రయివేటు’ బురిడీ
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది. ప్రయివేటుగా దీటుగా బోధన జరుగుతున్నా.. ఫలితాలు వస్తున్నా ఎక్కువ మంది ప్రయివేటు వైపు చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన టీచర్లు, ఇంగ్లీష్‌ మీడియం కూడా చక్కగా బోధించగల సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. మధ్యాహ్నభోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆటస్థలాలు అందుబాటు లో ఉన్నాయి. అయితే ప్రయివేటు పాఠశాలలను ఓ సామాజిక స్టేటస్‌గా భావించే సమాజం ముందు.. ప్రభుత్వ ప్రయత్నాలన్నీ చిన్నబోతున్నాయి. ప్రభుత్వం ప్రతియేటా జూన్‌ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం చేపడుతున్నా పేరెంట్స్‌ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావట్లేదు. ఈ నేపథ్యంలో ఓ బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ సంఘంగా టీఎస్‌యూటీఎఫ్‌ ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకతను చాటేందుకు ఈనెల 25వ తేదీ నుంచి ఎన్‌రోల్‌మెంట్‌ ప్రచార జాతను ప్రారంభించింది. జూన్‌ 5వ తేదీ వరకు ఈ జాత కొనసాగుతుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో జాయిన్‌ చేయించడం వల్ల కలిగే ఉపయోగాలను టీఎస్‌ యూటీఎఫ్‌ నేతలు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియచేస్తున్నారు.
సౌకర్యాలు మెరగవుతున్నా జీరో ఎన్‌రోల్‌మెంట్‌..
రాష్ట్రంలో 30,023 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,213 స్కూల్స్‌లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 13,364 పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ సంఖ్య 50లోపే ఉంది. రాష్ట్రంలో 21వేల టీచర్‌ పోస్టుల వరకు ఖాళీ ఉండగా పదివేల పోస్టులను టీఎస్‌యూటీఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ వంటి కొన్ని ఉపాధ్యాయ, విద్యార్థిసంఘాల పోరాట ఫలితంగా భర్తీ చేశారు. గతంలో 80శాతం స్కూళ్లలో సబ్జెక్ట్‌, భాషాపండితుల కొరత ఉన్నా వాటిని ప్రభుత్వ పాఠశాలలు అధిగమించాయి. ల్యాబరేటరీల సమస్యనూ అధిగమించాయి. ఈ ఏడాది స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాయి. కోవిడ్‌ కాలంలో ప్రయివేటు స్కూల్స్‌ ఆంక్షల కారణంగా కొంత పెరిగినా ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి పదో తరగతి వరకు సుమారు 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్నారు. వారిలో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే మిగతా విద్యార్థులంతా ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌లోనే చదువుతున్నారు.
6వ తరగతి నుంచి ప్రయివేటు వైపు మొగ్గు..
1 నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ దాదాపు సమానంగా ఉంటున్నా.. 6 నుంచి 10వ తరగతి చదువు కోసం ప్రయివేటులో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలోని స్కూళ్లలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు రూపొందించిన ఓ నివేదిక ప్రకారం 44శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50శాతం విద్యార్థులు కూడా ఉండటం లేదు. ఐదో తరగతి వరకు ఒక్కో క్లాస్‌లో 40-60శాతం మంది విద్యార్థులు ఉన్నా ఆ తర్వాత నుంచి 46-35 శాతానికి పడిపోతున్నాయి. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు కీలకంగా భావించి చాలా మంది గ్రామీణ విద్యార్థుల తల్లిదండ్రులు పట్టణాల్లో గదులు అద్దెకు తీసుకుని ఉంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. కొందరు 6వ తరగతికి వచ్చేనాటికి ప్రయివేటు రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో చేర్పిస్తున్నారు. వసతులు మెరుగవుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గుతున్న నేపథ్యంలో టీఎస్‌యూటీఎఫ్‌ పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టింది.

ప్రభుత్వ బడుల రక్షణతోనే ప్రయివేటులో ఫీజుల నియంత్రణ
ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. మన పిల్లలను సర్కారు బడిలో చేర్పించి నాణ్యమైన విద్యతో పాటు ఫీజుల ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల పరంగా ఏవైనా లోపాలుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవచ్చు. దీనిలో భాగంగా నర్సరీ క్లాస్‌ల కోసం పట్టుబడదాం. తరగతికో ఉపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వాన్ని కోరదాం. నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం. ప్రభుత్వ బడులను రక్షించుకుంటేనే ప్రయివేటు స్కూల్స్‌ ఫీజుల నియంత్రణ సాధ్యం.
షేక్‌ రంజాన్‌, పారుపల్లి నాగేశ్వరరావు, టీఎస్‌యూటీఎఫ్‌ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -