Wednesday, January 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ చేయుతతో మారిన గ్రామీణ మహిళ జీవితం

ప్రభుత్వ చేయుతతో మారిన గ్రామీణ మహిళ జీవితం

- Advertisement -

జేసీబీ నడిపి అడ్డంకులను అధిగమించిన పాలమాకుల అరుణ
ఎస్‌హెచ్‌జీల సహకారంతో ధైర్యంగా ముందడుగు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జేసీబీ వంటి భారీ యంత్రాలు పురుషులే నడపాలి అన్న భావనకు చెక్‌ పెట్టిన మహిళ పాలమకుల అరుణ. కుటుంబ బాధ్యత, ఆత్మవిశ్వాసం, స్వయం శక్తితో నిలబడాలనే తపనతో ఆమె ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రొత్సాహంతో ఆమె ప్రయాణం గ్రామీణ మహిళలకు ప్రేరణగా మారింది. జనగాం జిల్లా, జనగాం మండలం, ఎరుగొల్లపాడు గ్రామానికి చెందిన అరుణ పదో తరగతి వరకు చదివారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో జీవితం కష్టంగా మారింది. 2012లో పాలమకుల నాగరాజును వివాహం చేసుకున్నారు. వారికి రెండు కుటుంబాల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. దీంతో తమ జీవితాన్ని తామే నిర్మించుకోవాల్సి వచ్చింది. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో జీవితం సాగింది.
నాగరాజు కుటుంబ బాధ్యతల కోసం జేసీబీ డ్రైవింగ్‌ నేర్చుకుని డ్రైవర్‌గా పనిచేశారు. అదే సమయంలో అరుణ వ్యవసాయ కూలీగా పనిచేశారు. అరుణ కుట్టు పనులు కూడా చేసి జీవనాన్ని సాగించింది. అయితే 2013లో అరుణ స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)లో చేరారు. ఇది ఆమె జీవితంలో కీలక మార్పునకు కారణమైంది. 2014లో (ఎస్‌హెచ్‌జీ) ద్వారా రూ.ఒక లక్ష రుణం తీసుకుని పాత అప్పులు తీర్చగలిగారు. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, రుణాలు చెల్లించడంతో కుటుంబానికి కొంత ఆర్థిక స్థిరత్వం వచ్చింది.

జేసీబీ కొనుగోలుతో మారిన జీవితం
2019లో ఎస్‌హెచ్‌జీ బ్యాంక్‌ లింకేజ్‌, గ్రామ సంఘం, స్త్రీ నిధి సహకారంతో జేసీబీ కొనుగోలు చేశారు. ఇది గ్రామంలో మొదటి జేసీబీ కావడం విశేషం. గ్రామస్థుల సహకారంతో పనులు లభించాయి. క్రమశిక్షణతో అప్పులన్నీ పూర్తిగా తీర్చారు. భర్త ప్రోత్సాహంతో అరుణ స్వయంగా జేసీబీ నడపడం నేర్చుకున్నారు. 2024లో విజయవంతంగా జేసీబీ డ్రైవింగ్‌ పూర్తి చేశారు. మొదట అవహేళనగా చూసిన వారు నేడు ఆమెను అభినందిస్తున్నారు.
”భర్త యజమాని, భార్య డ్రైవర్‌ – మీరు ఇద్దరూ సరైన జోడి” అని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. ఎస్‌హెచ్‌జీల సహాయంతో అరుణ కుటుంబం ఇప్పటివరకు రూ.22.10 లక్షల వరకు రుణాలు పొందింది. వ్యవసాయం, కిరాణా దుకాణం, టాటా ట్రాలీ వాహనం, ద్విచక్ర వాహనం, బ్యాగుల తయారీ యూనిట్‌ వంటి పనుల ద్వారా కుటుంబం నిలదొక్కుకుంది. ప్రస్తుతం జేసీబీ ద్వారా గంటకు రూ.1,000ు1,200 వరకు ఆదాయం పొందుతూ రోజుకు సగటున రూ. 4,000 నుంచి రూ. 5,000 వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అరుణ ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ లీడర్‌గా, వీఓ అధ్యక్షురాలిగా, మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె నాయకత్వంలో గ్రామంలోని అనేక మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. ఎస్‌హెచ్‌జీల ద్వారా వస్త్ర దుకాణాలు, పిండి మిల్లులు, గాజుల దుకాణాలు ప్రారంబించారు. దీంతో వారి జీవితాలు మారిపోయాయి. ఆర్థికంగా నిలదొక్కు కోగలిగారు. దీంతో గ్రామస్తులంతా అరుణను అభినంది స్తున్నారు. సమాఖ్య అధ్యక్షురాలిగా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం తనకు గర్వంగా ఉందని అరుణ చెబుతు న్నారు. చిన్నప్పుడు అంగన్‌వాడీ టీచర్‌ కావాలన్న కల, నేడు మహిళా నాయకురాలిగా నిజమైందన్నారు. హ్యాండ్‌ లోన్లతో జీవితం మొదలుపెట్టి, నేడు జేసీబీ నడిపే స్థాయికి చేరిన తన ప్రయాణం ఎస్‌ హెచ్‌ జీల శక్తికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఎస్‌హెచ్‌జీలు, బ్యాంకు లింకేజీ లోన్లు, ప్రభుత్వ చేయుత లేకపోతే తన జీవితం కూలీగానే ముగిసిపోయేదన్నారు.

గ్రామీణ మహిళల శక్తిికి పాలమాకుల అరుణ మంచి ఉదాహరణ :మంత్రి సీతక్క
పాలమాకుల అరుణ జీవితం గ్రామీణ మహిళల శక్తికి మంచి ఉదాహరణ అని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాబి óవృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క అభినం దించారు. ”ఎస్‌ హెచ్‌జీల ద్వారా మహిళలు ఆర్థికంగా మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారనడానికి ఆమె నిదర్శనం. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు. ఈ మధ్య సెర్ప్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అరుణను కలిశాను. జేసీబీ నడుపుతున్న ఆమె ధైర్యం ప్రతి మహిళకు స్పూర్తిదాయకం. ఎన్ని కష్టాలు ఎదురైనా దైర్యంగా నిలబడి ఈ స్థాయికి అరుణ ఎదగడం ఆనందంగా ఉంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా లక్షలాది మంది అరుణలను తయారు చేయడమే మా ప్రజా ప్రభుత్వ సంకల్పం” అని సీతక్క తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -