2 గ్రాముల బంగారం, వెండితో చీరను ఆవిష్కరించిన కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళారత్న’ అవార్డు గ్రహీత నల్ల విజరు మరో అద్భుతాన్ని సృష్టించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు కేవలం రెండు గ్రాముల బంగారం, రెండు గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు, వెండి పూలతో కూడిన అత్యంత ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. బంగారు, వెండి తీగలతో నేసిన ఈ చీరను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్ల విజరు మాట్లాడుతూ తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన కేటీఆర్కు కృతజ్ఞతలు ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. సుమారు రూ.85 వేల వ్యయంతో రూపొందించిన ఈ చీర ప్రస్తుతం అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నది. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతుండడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.
సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



