Monday, December 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో పోషకాహారలోప సంక్షోభం

గాజాలో పోషకాహారలోప సంక్షోభం

- Advertisement -

ఆహార అభద్రతలో 80 శాతం మంది జనాభా
ఇజ్రాయిల్‌ ఆంక్షల ఎఫెక్ట్‌
మానవతా సాయాన్ని అనుమతించాలి : ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

గాజా : గాజాలో తీవ్రమైన పోషకాహార లోపం సంక్షోభం పొంచి ఉన్నదని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) హెచ్చరించింది. ప్రస్తుతం సుమారు 80శాతం జనాభా తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నదని తెలిపింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి 101,000 (లక్షమంది)కి పైగా పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మానవతాసాయంపై ఇజ్రాయిల్‌ ఆంక్షలతో గాజాలో పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. ”ఈ విపత్తును అంతం చేయడానికి పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అనుమతించాలి. మానవతా కార్మికులు తమ పనిని చేయడానికి అనుమతించాలి” అని యూఎన్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ ఫర్‌ పాలస్తీనా రెఫ్యూజీస్‌ ఇన్‌ ది నియర్‌ ఈస్ట్‌ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్‌ లాజారిని అన్నారు. 2025 అక్టోబర్‌ నుంచి కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, మానవతా అవసరాలు ప్రస్తుత ప్రతిస్పందన సామర్థ్యాన్ని మించిపోయాయని అన్నారు.సాయం చేరుకోవడం కంటే అవసరాలు వేగంగా పెరుగుతున్నాయని యూఎన్‌ సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ వ్యాఖ్యానించారు.

ఇది ప్రస్తుత మానవతా సాయ అసమర్థతను ఎత్తి చూపుతోందని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పంపిణీలో స్వల్ప మెరుగుదల ఉన్నప్పటికీ, నవంబర్‌లో 67శాతం గృహాలకు ఆహారం, రొట్టెలు అందాయని, కేవలం ”ప్రాథమిక మనుగడ అవసరాలు” మాత్రమే తీరుతున్నాయని చెప్పారు. గాజా జనాభాలో పావు వంతు అంటే ఐదులక్షలమంది ప్రజలు కరువు పీడిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ క్లాసిఫికేషన్‌ ఆగస్టులో వెల్లడించిన నివేదికలో పేర్కొన్నది. ఈ సంక్షోభానికి ఇజ్రాయిల్‌ మానవతా ఆంక్షలు, 7,30,000మందికి పైగా బలవంతంగా స్థానభ్రంశం చెందడం, 96శాతం వ్యవసాయ భూమి నాశనం కావడం కారణమని స్పష్టం చేసింది. ”ఇజ్రాయిల్‌ మానవతా సాయాన్ని అడ్డుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంతృత్వ అధికార చర్యలతో పాటు వాణిజ్య, సహాయ ట్రక్కుల ప్రయాణంపై ఆంక్షలు కరువును శాశ్వతం చేశాయి. ఈ అడ్డంకులను తొలగించకపోతే గాజాలో పౌరుల కార్యకలాపాలు కూలిపోతాయి” అని యూఎన్‌, పలు అంతర్జాతీయ ఎన్జీఓలు హెచ్చరిస్తున్నాయి.

2026 అక్టోబర్‌ నాటికి తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న 6 నెలల నుంచి ఐదేండ్ల వయస్సు కలిగిన 101,000 మంది చిన్నారుల్లో, 31,000కంటే ఎక్కువ మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడతారని ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ క్లాసిఫికేషన్‌ నివేదిక వివరించింది. అదనంగా 37,000 మంది గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు తీవ్రమైన పోషకాహార లోపం కోసం చికిత్స అవసరమని పేర్కొంది. అన్ని గాజా గవర్నరేట్‌లలో 6-23 నెలల మధ్య వయస్సు గల ఏ బిడ్డకి కూడా కనీస ఆహార వైవిధ్య అవసరాలను తీర్చడం లేదని వివరించింది. ఇటీవలి శీతాకాల తుపానుల కారణంగా ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. తుపానులో డిసెంబర్‌లో 55,000 నివాసాలను ముంచెత్తాయి. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ముగ్గురు పిల్లలు మరణంచారని యూఎన్‌ ఆఫీసర్‌ ఫర్‌ ది కో-ఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యుమన్‌టేరియన్‌ అఫైర్స్‌ (ఓసీహెచ్‌ఏ) తెలిపింది. శాశ్వత కాల్పుల విరమణ కోసం ఇజ్రాయిల్‌ వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలని, మావనతా సాయానికి ఆటంకాలు లేకుండా సరఫరా అయ్యేందుకు అధికారిక అడ్డంకులను తొలగించాలని గుటెరస్‌ పునరుద్ఘాటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -