రెండు రోజుల్లో తిరుగు జాతర
కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేశారు : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడారం జాతర విజయవంతం అయ్యిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు, తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో తిరుగు జాతర జరుగుతుందని తెలిపారు. ఒకరిద్దరు మినహా ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం జాతర ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారని గుర్తు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. పారిశుధ్యం, త్రాగునీరు, రవాణా, భద్రత వంటి మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేశామని తెలిపారు. గుడిలో చేసిన ప్రతి మార్పు పూజారుల ఆమోదం, ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే జరిగిందని స్పష్టం చేశారు. సమ్మక్క గద్దెల వద్ద కూడా రాజకీయాలు చేయడం దురదష్టకరమన్నారు. రాజకీయాలపై మాట్లాడితే మాట్లాడొచ్చుగానీ, దేవతలను, జాతరను కించపరచడం సహించబోమన్నారు. జాతరలో 13 వేల మంది పోలీసులు, 40 రోజుల పాటు జిల్లా యంత్రాంగం సేవలందించిందని తెలిపారు. జాతరకు దాదాపు రెండున్నర కోట్ల మంది భక్తులు వచ్చినట్టు భావిస్తున్నామని చెప్పారు. మేడారం చుట్టుపక్కల రోడ్లను వచ్చే జాతర సమయానికి వెడల్పు చేయడం ద్వారా ట్రాఫిక్ జామ్లను నివారిస్తామని అన్నారు. గోదావరి పుష్కరాల కోసం ములుగు జిల్లా పరిధిలోని పనులపై త్వరలో అధికారులతో సమీక్షిస్తామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ముగిసిందని అన్నారు. ఒక దొంగతనం ఘటనను కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. చిన్నచిన్న లోపాలుంటే భవిష్యత్లో సరిదిద్దుకుంటామని తెలిపారు.
మేడారం మహాజాతర విజయవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



