Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపొగాకు రహిత సమాజ నిర్మాణంలో మీడియాది కీలకపాత్ర

పొగాకు రహిత సమాజ నిర్మాణంలో మీడియాది కీలకపాత్ర

- Advertisement -

– ‘నో స్మోకింగ్‌ డే’పై వర్క్‌షాప్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ధూమపానం వల్ల కలిగే నష్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి మీడియా కృషి చేయాలని పలువురు వక్తలు కోరారు. ‘నో స్మోకింగ్‌ డే'(ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం) సందర్భంగా బుధవారం కవాడిగూడలో పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ)లో వార్త (మీడియా వర్క్‌షాప్‌) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఐబీ-హైదరాబాద్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శృతి పాటిల్‌, డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ మానస్‌ కృష్ణకాంత్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కన్సల్టెంట్‌ డాక్టర్‌ శ్రీగణ, జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ) ఐఈసీ అధికారి ఎస్‌.జితేంద్ర పాల్గొన్నారు.డాక్టర్‌ శ్రీగణ మాట్లాడుతూ ధూమపానం, పొగాకు వినియోగం వల్ల క్షయ సహా అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుందని, శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతింటాయని తెలిపారు. క్షయ బాధితుల్లో 8 శాతం మంది పొగాకు అలవాటు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. పొగాకు వ్యసనాన్ని మానుకోవాలనుకునే వారు నేషనల్‌ టొబాకో క్విట్‌లైన్‌ సర్వీస్‌ టోల్‌ ఫ్రీ నెంబరు 1800 112 356కు ఫోన్‌ చేసి, సలహాలు పొందొచ్చని సూచించారు.
ఎస్‌.జితేంద్ర మాట్లాడుతూ ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం సమాజానికే నష్టమని తెలిపారు. శృతి పాటిల్‌ మాట్లాడుతూ పొగాకు వ్యసనాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఎన్‌టీసీపీ) చేపట్టిందనీ, సీఓటీపీ చట్టం చేసిందని గుర్తుచేశారు. డాక్టర్‌ మానస్‌ కృష్ణకాంత్‌ మాట్లాడుతూ ధూమపానం, పొగాకు వినియోగాన్ని నివారణకు కేంద్రం నషా ముక్త్‌ భారత్‌ చేపట్టిందని తెలిపారు. పొగాకు నిర్మూలన స్వచ్ఛంద కార్యకర్త, టొబాకో కంట్రోల్‌ హీరో అవార్డు గ్రహిత మాచన రఘునందన్‌ మాట్లా డుతూ ధూమపానం నిర్మూలనలో సమాజంలోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహిం చవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, పీఐబీ, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌(సీబీసీ) అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -