1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్న బోర్డు
భర్తీకానున్న 2,322 పోస్టులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే 1,257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ను శనివారం విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులు, ఇతర వివరాలను బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. మొత్తం 2,322 పోస్టులకుగానూ 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ జాబితాలో ఉన్న వారికి ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుండ గా, ఎవరెవరు ఎప్పుడు వెరిఫికేషన్కు రావాలనే వివరాలను వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు బోర్డు సూచించింది.
2024లో 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, తాజాగా మరో 2,322 పోస్టులను భర్తీ చేస్తోంది. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సింగ్ ఆఫీసర్ల కొరత పూర్తిగా తీరిపోతుందని భావిస్తున్నది. దామోదర రాజనర్సింహ వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆ శాఖలో 9,572 పోస్టులను భర్తీ చేశారు. 2026లో వివిధ క్యాడర్లకు సంబంధించి 7,267 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి వైద్యారోగ్యశాఖలో 18 వేల ఖాళీలున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిలో ఈ ఏడాది జూన్ నాటికి 16,839 పోస్టుల భర్తీని పూర్తి చేయనున్నారు. అనంతరం మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.



