ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రక్రియ ముగియాలి
100 రోజుల్లో ప్రణాళికాబద్ధమైన చర్యలు : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్ను ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు(మార్చి నాటికి) పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్అండ్టీ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎస్ పాల్గొని.. మెట్రో రైల్ బదలాయింపు ప్రక్రియ తాజా స్థితిగతులను సమీక్షించారు. ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎటువంటి న్యాయపరమైన, సాంకేతికపరమైన ఆటంకాలు లేకుండా బదలాయింపు సజావుగా, వేగంగా జరగాలని సూచించారు. టేకోవర్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రానున్న వంద రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సీఎస్ స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియ కోసం నియమించిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ‘ఐడీబీఐ’ తన నివేదికను త్వరితగతిన అందించి, బదలాయింపును పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో ఎల్అండ్టీ సంస్థ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. టేకోవర్ పూర్తయిన తర్వాత మెట్రో నిర్వహణ(ఆపరేషనల్), మెయింటనెన్స్కు సంబంధించి విధివిధానాలు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) ఎండీ షెర్ఫరాజ్ అహ్మద్కు సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు(అర్బన్ ట్రాన్స్పోర్ట్) ఎన్వీఎస్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎల్అండ్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ కేవీబీ రెడ్డి, ఐడీబీఐ అధికారులు, హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



