– ట్రాన్స్ఫార్మర్ అమరికకు ఎదురుచూపులు
– దిష్టిబొమ్మగా మారిన ట్రాన్స్ఫార్మర్.. నెలలైనా అమర్చని అధికారులు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామంలో గృహాలకు సరైన విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వోల్టేజ్ సమస్యతో పరికరాలు పనిచేయకపోవడం, తరచూ కరెంటు కోతలు రావడం వల్ల గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించగా, ఆయన కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేశారు. అయితే మంజూరు చేసినప్పటికీ నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ట్రాన్స్ఫార్మర్ను అమర్చకపోవడం వల్ల అది గ్రామంలో దిష్టిబొమ్మలా పడి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు.
వేసవి కాలం మొదలవుతున్న నేపథ్యంలో ఎండలకు వోల్టేజ్ సమస్య మరింత తీవ్రమవుతుందని, ఫ్యాన్లు, ఫ్రిజ్లు, మోటార్లు పనిచేయక ప్రజలు నానా కష్టాలు పడతారని గ్రామస్తులు విన్నవించుకుంటున్నారు. వెంటనే వచ్చిన ట్రాన్స్ఫార్మర్ను అమర్చి వినియోగంలోకి తీసుకువస్తే సమస్యలు తీరుతాయని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.



