ఈ తీరును తక్షణమే విరమించుకోవాలి
అమెరికా దురాక్రమణ చర్యలను ఖండించాలి : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో
న్యూఢిల్లీ : ”వెనిజులాపై జరిగిన స్పష్టమైన దురాక్రమణ ఇది. ఆ దేశ అధ్యక్షుడిని, అతని భార్యను అమెరికా సాయుధ దళాలు అపహరించడంపై మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిస్పందించకపోవటం దారుణమైన విషయం” అని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో పేర్కొంది. భారత్ స్వాతంత్య్రం, దేశాల సార్వభౌమత్వాన్ని రక్షంచే దీర్ఘకాల వైఖరికి కేంద్రం పంపిన వివరణ అనర్హమైనదని తెలిపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన వెనిజులాలో పరిణామాలపై లోతైన ఆందోళనను మాత్రమే వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి చర్చలు జరపాలని కోరారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడాన్ని ఖండిస్తూ ఒక్క మాట కూడా ఆ ప్రకటనలో లేదన్నారు.
అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న కొన్ని యూరోపియన్ దేశాలు సైతం ట్రంప్ దుశ్చర్యను ఖండించాయని ఉదహరించారు. భారత్ వైఖరి బ్రెజిల్, దక్ష్షిణాఫ్రికా వంటి దాని బ్రిక్స్ భాగస్వాములు తీసుకున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. అధ్యక్షుడు మదురో, అతని భార్యను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అమెరికా అనుకూల వైఖరి మోడీ ప్రభుత్వ భావజాలానికీ, ట్రంప్ పరిపాలనతో వ్యూహాత్మక సంబంధాలకనుగుణంగా ఉందని తెలిపింది. ఈ వైఖరి ద్వారా భారతదేశం గ్లోబల్ సౌత్ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుందన్న వాదనను వదులుకున్నట్టు అయ్యిందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఈ అవమానకరమైన వైఖరిని విరమించుకోవాలని , వెనిజులాలో అమెరికా దురాక్రమణ, చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది.



