ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ వెంకటయ్య
నవతెలంగాణ-కంఠేశ్వర్/నిజామాబాద్సిటీ
కానిస్టేబుల్ హత్య ఎంతో బాధ కలిగించిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య తెలిపారు. హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. చైర్మెన్ వెంట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, అభివృద్ధి శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు ఉన్నారు.
అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగలవారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఐడీఓసీకి చేరుకున్న కమిషన్ చైర్మెన్ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పూల మొక్క అందించి స్వాగతం పలికారు.



