నిందితుడు పదో తరగతి విద్యార్థి
దొంగతనమా? క్రికెట్ బ్యాట్ కోసమా?
త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న పోలీసులు
వీడిన బాలిక హత్యకేసు మిస్టరీ
నవతెలంగాణ-కూకట్పల్లి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన పదేండ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు పదో తరగతి విద్యార్థిగా తేలింది. బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపిన పోలీసులు.. మృతురాలి తమ్ముడి స్నేహితుడైన బాలుడే నిందితుడని తేల్చారు. సంగీత్ నగర్లోని రావుస్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న నిందితుడు చోరీ కోసం బాలిక ఇంట్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. బాలిక గమనించడంతో ఆమెను హత్య చేసినట్టు సమాచారం. అయితే, మృతురాలి తమ్ముడి వద్ద ఉన్న ఎంఆర్ఎఫ్ క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి హత్య చేసి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాట్ అడిగితే ఇవ్వలేదన్న కక్షతోనే ఈ నేరానికి పాల్పడ్డాడని సమాచారం. దర్యాప్తులో భాగంగా నిందితుడి వద్ద ఒక లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో దొంగతనం చేయాలని, ఎవరైనా అడ్డొస్తే చంపేయాలని క్రూరమైన ప్రణాళిక రాసుకున్నట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
‘మిషన్ డన్’ పేరుతో బాలుడి లెటర్
‘మిషన్ డన్’ పేరుతో నిందితుడు తన చోరీ ప్లాన్ను పేపర్పై ఇంగ్లీష్లో రాసుకున్నాడు. అందుకు సంబంధించిన పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ లెటర్లో ఎముందంటే.. ”ముందుగా ఇంట్లోకి వెళ్లాలి. ఇంట్లో ఉన్న గ్యాస్, టేబుల్ని డోర్ వద్ద పెట్టాలి. ఇంటికి వేసిన లాక్ను గ్యాస్పై కాల్చాలి. ఆ తరువాత లాక్ను కట్ చేయాలి. లాక్ను కట్ చేసిన తరువాత డబ్బులు తీసుకోవాలి. ఆ తరువాత ఇంటికి లాక్ వేయాలి. ఆ తరువాత గ్యాస్ను పాత ప్రదేశంలో పెట్టి లీక్ చేయాలి. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి లాక్ వేయాలి” అని వచ్చీరాని ఇంగ్లీషులో రాశాడు. చివరిలో గ్యాస్ లీక్ చేయడం ద్వారా.. ఆ ఇల్లు ధ్వంసం అవుతుందని.. ఆ తర్వాత ప్రూఫ్లు కానీ.. మరే విషయం కూడా బయటకు రాదని అతను స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.