టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వికలాంగుల రాజకీయ భాగస్వామ్యం పెరగాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్ గాంధీభవన్లో ఆయన టీపీసీసీ వికలాంగుల విభాగం సభ్యత్వ నమోదు యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. వారి రాజకీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు యాప్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మెన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ లక్ష మంది వికలాంగులను సభ్యత్వ నమోదు చేయించడం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వెబ్ సైట్ను ప్రారంభించినట్టు తెలిపారు. వికలాంగుల వివాహాలకు నగదు ప్రోత్సాహకాన్ని రూ.2 లక్షలకు పెంచామనీ, కోర్టు ఉద్యోగాల్లో 4 శాతం, ఉన్నత విద్యలో, ఇందిరమ్మ ఇండ్లలో, రాజీవ్ యువ వికాసం పథకంలో ఐదు శాతం చొప్పున రిజర్వేషన్లను కల్పించినట్టు తెలిపారు.
బీఆర్ఎస్ పదేండ్లలో రూ.64 కోట్లు ఇస్తే, కాంగ్రెస్ సర్కారు రెండేండ్లలో రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ ఏడాదిలో 8వేల మంది వికలాంగులకు ఉచితంగా స్కూటర్లు, ల్యాప్ట్యాప్లు, బ్యాటరీ వీల్చైర్ల వంటి ఉచిత పరికరాలు అందించినట్టు చెప్పారు. వికలాంగులైన చిన్నారుల కోసం బాల భరోసా కార్యక్రమం, 40 శాతం వైకల్యానికే వికలాంగుల పరికరాలను అందజేశామనీ, వికలాంగులతో 7 వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వికలాంగుల చెంతకు వీరయ్య పేరుతో వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళుతున్న నేపథ్యంలో ఈ వెబ్సైట్ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దేశగాని సతీష్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారి, హైదరాబాద్ జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు రజిని, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సురేష్, రాష్ట్ర నాయకులు స్వామీతో పాటు ఆ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వికలాంగుల భాగస్వామ్యం పెరగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



