ఏఐసీసీ, క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తా : విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
నవతెలంగాణ -వనపర్తి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాల వల్లే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలకు నష్టం వాటిల్లిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపణలు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నంది హిల్స్లోని తన నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలోని 140 గ్రామ పంచాయతీల్లో ఇటీవల జరిగిన ఎన్నికలలో రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తమ సంతృప్తిని ఓటు రూపకంగా తెలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు తమ మద్దతు తెలిపిన ఓటర్లకు, ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలో 51 శాతం బీసీలను బరిలో దించామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 51 గ్రామ పంచాయతీ స్థానాలలో 15-20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నా తమ పార్టీ సీనియర్ నాయకుల వెన్ను పోటు రాజకీయాల కారణంగా కార్యకర్తలకు నష్టం జరిగిందని ఆరోపించారు. ఈ విషయమై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ, హైకమాండ్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేగా తనపై నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవికి కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ పార్టీకి ద్రోహం చేసేవాళ్ల తీరును కాంగ్రెస్ పార్టీ మేధావులు, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డు అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మెన్, వైస్ చైర్మెన్, నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వెన్నుపోటు రాజకీయాల వల్లే పార్టీకి నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



