Saturday, May 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినాగలిని నాయకుడు చేసిన శేషేంద్ర కావ్యం

నాగలిని నాయకుడు చేసిన శేషేంద్ర కావ్యం

- Advertisement -

”నేనెప్పుడూ గొంతెత్తినా నా కోసం కాదు. ఐదు కోట్ల మంది కోసమూ కాదు. యాభై కోట్ల మంది కోసం..”… అంటూ అర్థశతాబ్దికి పూర్వమే రణన్నినాదం చేసిన తెలుగువారి జాతీయ కవి గుంటూరు శేషేంద్ర శర్మ.1975 లో వీరు రచించిన ”నా దేశం నా ప్రజలు” కావ్యానికి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. ఈ కావ్యం అవతారికలో శేషేంద్ర తెలుగు ప్రజల సంఖ్య కాకుండా ఆనాటి దేశ ప్రజల సంఖ్యను ఉద్దేశిస్తూ.. తన జాతీయదష్టిని చాటిచెప్పారు.
తెలుగు సారస్వత జగత్తులో మహాకావ్యాలు సష్టించిన మహాకవులెందరో ఉన్నారు. పద్యం, గేయం, వచనం వంటి ప్రక్రియలతో తెలుగు అక్షరానికి పట్టాభిషేకం చేసి వెయ్యేళ్ళకు పైబడి ప్రజాహదయ సామ్రాజ్యాలను పరిపాలిస్తున్నారు. అయితే ఆ మహాకవుల విద్వత్తును, కావ్య నిర్మాణ చాతురీ గరి మను ఆవాహనం చేసుకుని.. ఇది పట్టాభిషేకాల యుగం కాద ని ప్రజాస్వామ్య పథంలో..న్యాయేన మార్గన జనరాజ్య తంత్రా.. అంటూ సామాన్య మానవుని యుగపురుషునిగా ప్రతిష్టిస్తూ ఆధునిక మహాభారతాన్ని నిర్మించిన విప్లవ వేదవ్యాసుడే శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ.
”లేస్తోంది ఒక హస్తం. ఆ హస్తం కాలం అనే నిరంతర శ్రామికుని సమస్తం” అంటూ ప్రారంభమయ్యే ఈ కావ్యంలో శేషేంద్ర ”ఈ దేశానికి నాగలి ప్రతీక. ఈ దేశపు ఆకతి నాగలి ఆకతి ఒకటే” అని ప్రకటిస్తూ ఆ నాగలి కథానాయకుడైన సామాన్య కర్షకుని తన కవన వేదికపై స్వర్ణ ప్రతిమగా ఆవిష్కరించారు. ఆయన మాటల్లోనే
”..ఇతిహాస నిర్మాణానికి బాధానుభూతి పూర్వక మైన బలి కావాలి. నేనే ఆ బలి. నా వయసు, నా పాండి త్యం, నా ప్రతిభ, నా అనుభవం సర్వం పిండి మాటల గొంతులో పోసిన నా రక్తం ఈ ఇతిహాసం” అంటూ శేషేంద్ర తన కావ్యపీఠికలో స్వయంగా ప్రస్తావించారు. ఇతిహాసం ప్రతి యుగంలోనూ సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కాలంలోని ఇతిహాసం ఈనాటి మనిషి ఆశల్ని ఆశయాలని గానం చేయాలి. ఈనాటి తిరుగుబాటు గురించి గర్జించాలన్నదే శేషేంద్ర సంకల్పం.
కవి కన్ను ఒక ప్రిజం.. అంటారు శేషేంద్ర. అంటే పట్టకం. కాంతి పతనమయ్య కోణాన్ని బట్టి వక్రీభవనంగాని, సంపూర్ణాంతర పరావర్తనంగాని చెంది వైవిధ్య భరితమైన దశ్యాలను ఆవిష్కరించడం ప్రిజం లక్షణం. వీరి కంటికి ఆ విశేష లక్షణం ఉంది. అందుకే ఆయనకు ఎండలు కొండలపై కండువాలుగాను, ఒంటరితనం అంటే శూన్యంలో నిశ్శబ్దాలు పోగు చేయడంగాను, పలకా పుస్తకాలు మోస్తున్న బడి పిల్లలు శిలువలు మోసుకుపోతున్న బాలక్రీస్తుల్లానూ కనిపిస్తారు.
అన్యాయానికి రగిలినప్పుడు ”కవిత్వం వద్దు. వెయ్యి ప్రళయాలు దట్టించిన ఒక బాంబు ఇవ్వండి” అన్న శేషేంద్రలో..
”ఎందుకు నీకా గుండె
దాన్ని బాధలతో నింపుకోలేకపోతే
ఎందుకు నీకా కళ్ళు
నీవు వాటిని కన్నీళ్ళతో తడుపుకోలేకపోతే” అనే ఆర్ద్రత కూడా ఉంది.
ఆయన నాగలికి ప్రాణదాన సాధనం అని పేరు పెట్టారు. ”మతవీరులైన కోట్లాది శ్రామిక జీవులు భూమిని వదలలేక మట్టిలో కలిసి నిరీక్షిస్తుంటారు. గింజ దిగగానే, చినుకు పడగానే వారు ప్రేమించిన ఆ గింజల గర్భంలోకి ప్రవేశిస్తారు. చెట్లవుతారు. పైరులవుతారు. పళ్ళయి, పంటలై మనుషుల్లో ప్రవేశిస్తారు. మనుషుల జన్మలకు మళ్ళీ బీజాలవుతా”రన్న ఆ మహనీయునికి, ఆ ఋషితుల్యునికి ఎన్నిసార్లు పాదాభివందనం చెయ్యాలి?
పెద్దనకు కవిత్వం రాయాలంటే నిరుపహతి స్థలంబు వగైరా సరంజామా కావాలి. కానీ శేషేంద్ర గారికి నాలుగు పూలు చాలు నవరసావిష్కరణకు. పూల భిక్షువుల్లో కలిసిపోయి అడవుల రంగుల్లో మునిగి తపస్సు చేశానంటున్న శేషేంద్ర ”ఈ నికష్టపు నాగరికత విడిచే బొగ్గు పులుసు వాయువు పీలుస్తూ చెట్లు పూలెలా పూస్తున్నాయి” అని ఆశ్చర్యపోతున్నారు. అడవుల్ని కప్పుకొని, నదుల్ని తలపాగాలుగా చుట్టుకొని, రాస్తా ఉత్తరీయంగా వేసుకుని నడుస్తున్న శేషేంద్ర ”కాలాన్ని కాగితం చేసుకుంటా- దానిమీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా – దాని కింద నా ఊపిరితో సంతకం చేసి ఇస్తా..” అంటున్నారు.
‘నా దేశం నా ప్రజలు’ వచన కవిత్వం కాదు. ఇది వచన కావ్యం. 13వ శతాబ్దంలో కష్ణమాచార్యుల సింహగిరి వచనాలతో ప్రారంభమైన ఈ వచన కావ్య ప్రక్రియను శేషేంద్ర ఎంచుకున్నారు. వీరు ఈ కావ్యాన్ని ఇతిహాసమన్నారు. మనకు తెలిసి రామాయణ మహాభారత ఇతిహాసాలు కథాపరమైనవే. కథాపరమైన ఇతివత్తం లేని ఇతిహాసాలు కొన్ని విదేశాల్లో వెలుగుచూశాయి. రోమన్‌ కవి వర్జిల్‌, ఆంగ్లకవి మిల్టన్‌, సెయింట్‌ జాన్‌ వెర్స్‌ వంటి కవులు కొందరు వీటిని రచించారు. ఈ నేపథ్యంలోనే శేషేంద్ర నా దేశం నా ప్రజలు వెలువడింది. ఈ విధంగా ఆరంభంలోనే అంతర్జాతీయ దక్పథాన్ని, అంతర్జాతీయ స్థాయిని గడించిన శేషేంద్ర కావ్యాలకు పలు విదేశీ భాషల్లోనూ అనువాదాలున్నాయి. ఈ కావ్యాన్ని ఆంగ్లంలో శేషేంద్ర స్వయంగా అనువదించగా, హిందీలో ఓం ప్రకాష్‌ నిర్మల్‌ అనువదించారు.
శేషేంద్ర గారిది విలక్షణ వీక్షణం. అభ్యుదయ అరుణోదయ మానవీయ హదయగత విప్లవ వైవిధ్యమే అనుక్షణం. వర్గ చైతన్యం జ్వలింప చేయడమే కావ్య హదయం. ”జీవన సంగ్రామంలో మనిషి మనిషిగా నిలబడటానికి కావలసిన ఆత్మస్థైర్యమనే గాండీవాన్ని ధరించాలి..” అంటున్న శేషేంద్ర స్వయంగా కవిసేనకు సారధ్యం వహించి తన దేశానికి, తన ప్రజలకు తనే ఆ గాండీవం అయ్యారు.
మే 30 శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ వర్థంతి సందర్భంగా..

– డా.వెనిగళ్ళ రాంబాబు, 98480 44329

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -