‘ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పులేదని నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. అయితే ‘హరిహర వీరమల్లు’ పేరుతో పర్సంటేజి సమస్యను పక్కదారి పట్టించారని ఆయన ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఇందులో కుట్ర కోణం ఉందని అనుమానించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇటీవల సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పరిణామాలపై ఆర్.నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రజా గాయకుడు గద్దర్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి అవార్డులు ప్రకటించడం చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగానైతే గద్దర్ అవార్డులు ప్రకటించిందో అలాగే నంది అవార్డులను కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా సినీ పరిశ్రమలో బంద్ ప్రకటించాలంటే కనీసం మూడు వారాల ముందుగానే తెలియజేయాలి. అలా తెలియజేస్తే విడుదల తేదీ ప్రకటించుకున్న వాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. జూన్ 1న థియేటర్లు బంద్ ప్రకటిస్తే, జూన్ 12 అంటే రెండు వారాలు కూడా కావు కదా?, మరి ఏ రకంగా ‘హరిహర వీరమల్లు’కు బంద్ వర్తిస్తుంది?, అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ మీద ఎవరు కుట్ర పన్నుతారు?, మేం పవన్ కళ్యాణ్ పై ఏ రకంగా వ్యతిరేకులం కాదు. పర్సంటేజ్ సిస్టమ్ వల్ల సినీ పరిశ్రమకు, నిర్మాతలకు చాలా మేలు జరుగుతుంది. ఆ విధానం లేకపోవడం వల్ల నిర్మాత తీవ్రంగా నష్టపోతున్నాడు. అలాగే టికెట్ ధరలు పెంచితే సినిమాకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు టికెట్ ధరల పేరుతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. అది సరైన పద్దతి కాదు. ఈ విషయాన్ని రెండు ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలి’ అని అన్నారు.