– షబ్బీర్ అలీకి వినతిపత్రం అందజేసిన ఆశాలు
నవతెలంగాణ – కామారెడ్డి
ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ఆశా వర్కర్లతో సుమారు గంటపాటు చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కే. చంద్రశేఖర్, కార్యదర్శి ముదం అరుణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18,000 అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో తమతో పని చేయించుకుని ఇప్పటికీ పారితోషికం చెల్లించలేదని, వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1,500 పారితోషికాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు ఉన్న ఆరు నెలల పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యల పరిష్కారానికి సమయం ఇచ్చి కృషి చేస్తానని హామీ ఇచ్చిన షబ్బీర్ అలీ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఇందిరా, కార్యదర్శి రాజశ్రీ, నాయకులు మమత, గీత, శోభ తదితరులు పాల్గొన్నారు.



