నవతెలంగాణ- భూపాలపల్లి
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలనితెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ పట్టణాల్లో, నగర పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించి పేదలకు, వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలన్నారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న భార్యాభర్తలకు గడ్డపార, తట్ట, పారా, కొడవలి, గొడ్డలి వంటి పనిముట్లు ఇవ్వాలని, పని ప్రదేశంలో కార్మికులకు తాగడానికి మంచినీరు ప్రతి విధిగా అందించాలన్నారు.పని ప్రదేశంలో నీడ కోసం టెంట్, ప్రమాదంలో గాయపడితే చికిత్స కోసం మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలన్నారు. 2025 జనవరి నుండి బందు చేసిన (నిలుపుదల చేసిన) నూతన జాబు కార్డులను దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇవ్వాలని, జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 164 ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఏపీఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పని ప్రదేశంలో కూలీలను రోజుకు రెండుసార్లు ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలని, సమ్మర్ అలవెన్సులు, నాలుగు కిలోమీటర్ల దూరం దాటితే లోకల్ ఆటో చార్జీలు చట్ట ప్రకారం ఇవ్వాలన్నారు.
ఆధార్ కార్డుతో లింకు, ఆన్లైన్ పేమెంట్ చెల్లింపులు, కొలతల ఆధారంగా వేతనాలు ఇచ్చే పద్ధతిని రద్దు చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేసి వారి జీతాలు పెంచాలన్నారు. వాచర్లను, సీనియర్ మేట్లను ప్రత్యేకంగా గుర్తించాలని, సంవత్సరం మొత్తం పనులు కల్పించాలను, అర్హత కలిగిన వారికి ఎఫ్ఏలు గా ప్రమోషన్ ఇవ్వాలన్నారు. పని ప్రదేశంలో ప్రమాదం జరిగి కార్మికులు గాయపడితే ఉచిత వైద్యంతోపాటు, పనిచేయని రోజులలో కూడా కూలీ డబ్బులు చెల్లించాలని, పని ప్రదేశంలో ప్రమాదం జరిగి మరణిస్తే 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. కూలీలకు పని ఇవ్వకుంటే చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఎంపిక చేసిన 10,517 మందికి వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 గుంటల లోపు భూమి ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఎంపిక చేసి 12 వేల రూపాయలు ఇవ్వాలని, జిల్లాలో ఉపాధి కూలీలకు మెరుగైన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు గట్టు శంకర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెలిశెట్టి రాజయ్య, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వంగల విజయలక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు బందు సుజాత, నాయకులు మల్లయ్య, స్వాతి, కవిత, గోమతి, కవిత, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.