23,24,25 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు
చేనేత కార్మిక సంఘం కరపత్రం విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 నుంచి 25వరకు హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వనం శాంతి కుమార్, గంజి మురళీధర్, కార్యదర్శి ముషం నరహరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆ సంఘం కరపత్రాన్ని విడుదల చేశారు. నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి రెండేండ్లయిందనీ, త్రిఫ్ట్ పథకంలో చేనేత కార్మికుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం రెండు నెలలు డిపాజిట్ చేసి మిన్నకుండిపోయిందని తెలిపారు.
జియో టాగ్ ఉన్న చేనేత కార్మికుడు మరణిస్తే నేతన్న బీమా ద్వారా రూ.5 లక్షలు ఇవ్వాలని ఉన్నా.. చనిపోయి ఏడాదిన్నరయినా నేటి వరకు నేతన్న బీమా అమలు కాలేదని పేర్కొన్నారు. ఇంకా అనేక సమస్యలను చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాబోయే బడ్జెట్లో చేనేత, పవర్లూమ్లకు రూ. నాలుగు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో సహారా ఎస్టేట్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంటయ్య, సహారా ఎస్టేట్ సంక్షేమ సంఘం కోశాధికారి శేఖరయ్య, చేనేత నాయకులు రాపోలు విశ్వ నాథం, ఎ మమత జైపాల్, వై వెంకటేశ్వర్లు, గజం శ్రీశైలం, సి హెచ్ రవికుమార్, దుస్స కుమార్, కె రాములు పాల్గొన్నారు.



