Thursday, June 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఒగ్గుబీర్ల కళాకారుల సమస్యలు పరిష్కరించాలి

ఒగ్గుబీర్ల కళాకారుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

– జనగామలో ఒగ్గు కళాక్షేత్రాన్ని నిర్మించాలి : ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఒగ్గు ధర్మయ్య, డాక్టర్‌ ఒగ్గు రవి
నవతెలంగాణ-జనగామ

రాష్ట్రంలో ఒగ్గుబీర్ల కళాకారుల సమస్యలు పరిష్కరించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఒగ్గుబీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఒగ్గు ధర్మయ్య, ఒగ్గు రవి కోరారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎంఎంఆర్‌ గార్డెన్‌లో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, జనగామ జిల్లా ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘ఒగ్గు కళా వికాసం, భవిష్యత్తు ప్రణాళిక’ అంశంపై సదస్సు, ఒగ్గుకళా మహౌత్సవం-2025 కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు జనగామ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ఒగ్గుబీర్ల కళాకారుల కళాబృందాలతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఒగ్గుబీర్ల పూజారులు, బోనాల కోలాటం, ఆడబిడ్డల అడుగుల సవ్వడితో జనగామ జిల్లా బీరప్ప గుడి నుంచి మొదలైన మల్లన్న శోభాయాత్ర వైభవోపేతంగా వేదికకు చేరుకుంది. జిల్లాలోని మండలానికి మూడు చొప్పున ఒగ్గు బృందాలు జనారంజకంగా ప్రదర్శనలు చేశాయి. ఈ సందర్భంగా ధర్మయ్య, రవి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఒగ్గు కళా సామ్రాట్‌ చుక్కా సత్తయ్య పేరు మీద ఒగ్గు కళాక్షేత్రాన్ని నిర్మించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఒగ్గుబీర్ల పూజారులు కేవలం వృత్తిని నమ్ముకుని కళా జీవితం గడుపుతున్నారన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో మల్లన్న పట్నాలు, బీరన్న పట్నాలు వేసి ఇంటికి తిరుగు ప్రయాణం సమయంలో రోడ్డు ప్రమాదాలకు గురై అంగవైకల్యం చెందిన పూజారులు కొంతమంది అయితే, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన వారే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో జీవించే కళాకారుని కుటుంబం నేడు అప్పులపాలై, కడు బీదరికంతో ఉందన్నారు. జనగామ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఒగ్గుబీర్ల కళాకారులు ఉన్నారని తెలిపారు. ఒగ్గు పూజారులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించాలన్నారు. అర్హులైన వృద్ధ కళాకారులకు(45ఏండ్లు) రూ.6000 చొప్పున పెన్షన్‌ అందించాలని కోరారు. ఇండ్లు లేని నిరుపేదలైన ఒగ్గు పూజారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో అర్హులైన ఒగ్గుకళాకారులకు ఉద్యోగం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన ఒగ్గుబీర్ల కళాకారులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కంచ రాములు, ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశం, ఒగ్గు సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు బండి వీరస్వామి, ప్రధాన కార్యదర్శి జంగిడి సిద్ధులు, ప్రచార కార్యదర్శి బర్ల అనిల్‌ కుమార్‌, కురుమ సంఘం టౌన్‌ అధ్యక్షులు బాల్డమల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -