Saturday, June 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలి

తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించాలి

- Advertisement -

– మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంపై అఖిలపక్ష సమావేశం
– బనకచర్లను వెంటనే ఆపాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తుమ్మిటిహట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును తక్షణమే నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అప్పుడే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకూ సాగునీరందుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఆపాలనీ, దాని పునర్మిర్మాణం, మరమ్మతుల సాధ్యాసాధ్యాలపై అఖిలపక్ష సమావేశాన్ని, నీటిపారుదల రంగ నిపుణులు, మేధావులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్‌ పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును సీపీఐ మొదటి నుంచి వ్యతిరేకించిందని గుర్తు చేశారు. దాని బదులుగా గతంలో నిర్ణయించిన ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్దే బ్యారేజీ నిర్మిస్తే ఒక్క లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి గ్రావిటీతో నీళ్లు తీసుకెళ్ళే అవకాశం ఉండేదన్నారు. రీడిజైన్‌ పేరుతో దాన్ని పక్కనబెట్టి, కాళేశ్వరం పేరుతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దిగువన నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బ్యారేజీల నుంచి ఎగువన ఎల్లంపల్లికి నీటిని లిఫ్టు చేయడం అధిక వ్యయంతో కూడుకున్నదని చెప్పారు. ఆ మూడు బ్యారేజీల నిర్మాణానికి రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఖర్చయ్యిందన్నారు.
వాటిని తిరిగి నిర్మించినా, మరమ్మతులు చేసినా భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది చెప్పలేమనీ, కాబట్టి విజిలెన్స్‌ నివేదిక, ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక, జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికలను ప్రభుత్వానికి త్వరగా ఇవ్వాలని కోరారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందనేది నిజమనీ, ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఇంజినీర్లపై ఏసీబీ దాడుల్లో రూ.కోట్లు బయటపడుతున్నాయనీ, ఇద్దరిని అరెస్టు చేశారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును వెంటనే ఆపాలనీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై చర్చించుకోవాలని డిమాండ్‌ చేశారు. వరద జలాలపై తెలంగాణకు సైతం హక్కు ఉంటుందనీ, ఇందుకు సంబంధించి వాటాను తేల్చకుండా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు సాగునీటి పారుదల రంగం నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపర్చడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా విమర్శించారు. పాక్తిసాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో దాడికి పాల్పడితే ఒక్క దేశం సంపూర్ణంగా మద్దతు ప్రకటించలేదని అన్నారు. కాళేశ్వర్‌ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాల సాగుభూమికి నీళ్లిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -