Wednesday, June 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరిజర్వేషన్లు పెంచే బాధ్యత జాతీయ పార్టీలదే..

రిజర్వేషన్లు పెంచే బాధ్యత జాతీయ పార్టీలదే..

- Advertisement -

సీఎం అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలి
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం
బీసీ సంఘాల రౌండ్‌ సమావేశంలో బీసీ నేతలు
నవతెలంగాణ- బంజారాహిల్స్‌

”స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి.. బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యతను కాంగ్రెస్‌, బీజేపీ తీసుకోవాలి.. లేదంటే రాష్ట్రంలో ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడా అడ్డుకుంటాం” అని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన బీసీ సంఘాలు, మేధావుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్‌, శాసనమండలి బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు తెలిపిందని, కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ముఖ్యమంత్రి ఢిల్లీకి అఖిలపక్షంతో వెళితే బీఆర్‌ఎస్‌ పాల్గొంటుందని స్పష్టం చేశారు. బీసీలు ఇప్పటికైనా ఒక్కటి కావాలని లేకుంటే భవిష్యత్‌ లేదన్నారు. జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసి చేతులు దులుపుకోకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్రం చేపట్టనున్న కులగణన కంటే ముందే తెలంగాణ అసెంబ్లీలో చేసిన బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో చేసిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారని, కానీ అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలవకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే ప్రధానిని సమయం కోరి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా కృషి చేయకుండా హైదరాబాద్‌లో ఉండి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెండ్రోజుల్లోనే బీసీ సంఘాలు, మేధావులు న్యాయనిపుణులతో చర్చించి భవిష్యత్‌ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.
బీసీ ఇంటలెక్వల్‌ ఫోరం చైర్మెన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి టి.చిరంజీవులు మాట్లాడుతూ.. తమిళనాడు తరహాలో కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లును చేర్చి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో విడుదల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, మేధావులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ బాలగోని బాలరాజుగౌడ్‌, మహాత్మ జ్యోతిబాఫూలే జయంతి నిర్వహణ కమిటీ చైర్మెన్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌, బీసీ నేతలు ఉప్పరి శేఖర్‌ సగర, దీటి మల్లయ్య, ప్రొఫెసర్‌ నరేందర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ అశోక్‌ కుమార్‌, కోలా జనార్ధన్‌, దాసోజు లలిత, బి.మని మంజరి, గొడుగు మహేష్‌ యాదవ్‌, జాజుల లింగం గౌడ్‌, కిరణ్‌ కుమార్‌, కవుల జగన్నాథం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -