అన్ని ఎల్ఈడీ లైట్లను సీసీసీకి అనుసంధానించండి…
వాటి ఏర్పాటుకు కొత్తగా టెండర్లు పిలవాలి : ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎల్ఈడీ వీధి దీపాలపై రాష్ట్రమంతటా పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని సూచించారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)లో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయా? లేదా? లేకపోతే కొత్తగా ఎన్ని అవసర మున్నాయో పక్కాగా అంచనా వేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ప్రతీ పోల్నూ సర్వే చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాత్రి పూట ఎల్ఈడీ లైట్లు పని చేయటంతోపాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా ఉండేందుకు పక్కగా పర్యవేక్షణ చేయాలనీ, అన్ని గ్రామాల ఎల్ఈడీ డ్యాష్ బోర్డులను మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షించాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ అధ్వర్యంలో ఉందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులకే వీటిని అప్పగిస్తే.. లైట్ల నిర్వహణ, విద్యుత్తు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు సమావేశంలో వ్యక్తమయ్యాయి. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 5.50 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ సీఎంకు నివేదించింది. గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టు ముగియటంతో ఇప్పుడు చాలాచోట్ల లైట్లు వెలగటం లేదని, నిర్వహణ కూడా సరిగా జరగలేదని అధికారులు తెలిపారు. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని సీఎం… వారిని ఆదేశించారు. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు కొత్తగా టెండర్లు పిలవాలని కోరారు. వాటి తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వనించాలనీ, ఏడేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు వాటికే అప్పగించాలని సూచించారు. నిర్వహణ పక్కగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించుకోవాలని ఆదేశించారు.
ఎల్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్ ల ఏర్పాటు, నిరంతరం అవి పనిచేస్తున్నాయా? లేదా? ఏయే ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ.8 కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తోందనీ, విద్యుత్తును ఆదా చేసేందుకు వీలుగా సోలార్ పవర్ను వినియోగించే అంశాన్ని, అందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీ ఏరియాతో పాటు ఔటర్ అవతల ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలతో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో కొత్త గ్రామాల విలీనం, గ్రామాల మార్పులు చేర్పులు జరిగాయని అన్నారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని సూచించారు. కోర్ అర్బన్ సిటీతో పాటు మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ లైట్లకు కూడా టెండర్లు పిలవాలని ఆయన ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీజన పాల్గొన్నారు.