అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు బాలయ్య
నవతెలంగాణ – మిడ్జిల్
ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాలుకు గజ్జ కట్టి ఆటపాటలతో ఊరు వాడ తిరుగుతూ, ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రజా కవి గద్దర్ అన్న పాత్ర మరువలేనిదని అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు బాలయ్య, మాల మహానాడు రాష్ట్ర నాయకులు జంగయ్య, తెలంగాణ ఉద్యమ నాయకులు శంకర్ అన్నారు. గద్దర్ 78 వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం ఎదుట ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల కోసం గద్దర్ త్యాగం మరువలేనిదని అన్నారు. శరీరంలో తుపాకీ తూటాలున్న, గోసి , గొంగడేసుకుని తన పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ నిరంతరం ప్రజల కోసమే పనిచేసిన నాయకుడు గద్దర్ అని కొనియాడారు. గద్దర్ ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తామని అణగారిన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చయ్య, డి కృష్ణయ్య, ఉస్మాన్, వర్కాల శ్రీనివాసులు, అలివేల, ఉస్మాన్, నందం, జహీర్, తదితరులు పాల్గొన్నారు.



