– 50 మంది ప్రయాణికులను కాపాడి మృతి
– యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఘటన
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
ప్రయాణంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్ చివరి క్షణంలోనూ బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను కాపాడి మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్సు మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్నది. చౌటుప్పల్కు రాగానే డ్రైవర్ కట్టవరపు నాగరాజు(43)కు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పితో అస్వస్థత కలిగింది. వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే డ్రైవర్ను స్థానికుల సహాయంతో సమీప ప్రభుతాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. విజయవాడకు చెందిన డ్రైవర్ నాగరాజుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు చివరి వరకు బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్ సేవాభావాన్ని పోలీసులు ప్రశంసించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ డ్రైవర్కు గుండెపోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



