నష్టాలతో కన్నీళ్లు పెడుతుంటే రాజకీయం ముఖ్యమా
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి 
రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా…వినతి పత్రం అందజేత 
నవతెలంగాణ – మిర్యాలగూడ 
అకాల వర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే రైతుల గోస ను పాలకులు పట్టుకొచ్చుకోవడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. నేలకొరిగిన గింజలు రాలిపోయిన వరి పేరతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా తుఫాను కారణంగా లక్షలాది ఎకరాలు పంట నష్టం వాటిలిందని, నల్గొండ జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు పైగా పంటలు నీటిపాలు అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో నాశనమైందని అన్న దాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రైతుల కోసం అంతా కాదని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ ఎన్నికలపై దృష్టి పెట్టడం సరైనది కాదన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రైతులు పంటలు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నా.. కనీసం ఓదార్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయం కోసం పాకులాడుతున్నారని ధ్వజ మెత్తరు.
రైతుల గోస పాలకులకు పట్టదా అని ప్రశ్నించారు. రైతులు విత్తనాలు నాటి నుంచి మొదలుకొని ఎరువుల కోసం, సాగునీటి కోసం చివరికి పండించిన పంట అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నాడని తెలిపారు. ప్రతి సీజన్లో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల రీత్యా పంటలు నష్టపోతే పంటల బీమా పథకం కింద రైతులను ఆదుకోవాల్సి ఉంటుందని, కానీ ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని అమలు చేయడం లేదని ఆరోపిచారు. దాని ఫలితంగా ప్రకృతి వల్ల పంటల దెబ్బతింటే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.
తక్షణమే కేంద్,ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన వివరాలను సేకరించి రైతులకు ఎకరానికి రూ.30 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని ఆ విధంగా ప్రకటన చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని డి ఏ ఓ శ్రీనివాస్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు, సీపీఐ(ఎం) వన్ టౌన్ టూ టౌన్ కార్యదర్శలు డా.మల్లు గౌతమ్ రెడ్డి, బావాండ్ల పాండు, జిల్లా నాయకులు వినోద్ నాయక్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, నాయకులు పాల్వాయి రాంరెడ్డి, గోవింద్ రెడ్డి, గాయం వీరా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోన్ రెడ్డి వెంకట్ రెడ్డి, దయానంద్, అరుణ, కోటి రెడ్డి, చౌగాని వెంకన్న, కృష్ణయ్య, రామకృష్ణ, సూర్యం,లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.


 
                                    