Wednesday, January 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి

సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి

- Advertisement -

రూ.251 కోట్లకుపైగా నిధులతో పనులు
సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ
మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులకు
రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, సీతక్క సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఈ ఏడాది మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు గతంలో వచ్చిన వారికంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వివిధ శాఖలు సమన్వయంతో భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్షణ్‌ కుమార్‌, సీతక్క సూచించారు. ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతర జరగనున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్‌ కుమార్‌, రాష్ట్ర పంచాయితీరాజ్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్‌ కుమార్‌, సవ్యసాచి ఘోష్‌, అడిషనల్‌ డీజీలు విజరు కుమార్‌, స్వాతి లక్రా, వివిధ శాఖల కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్షణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఆ అంచనా మేరకు రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మహాజాతరను విజయవంతంగా నిర్వహించడం ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని, ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన కోరారు. రూ.150 కోట్లకుపైగా నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు. భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్‌ నియంత్రణ పటిష్టంగా ఉండాలనీ, ప్రత్యేక రూట్‌ మ్యాప్‌లతో పాటు అవసరమైన చోట వన్‌వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు.

ఈ జాతరపై క్యాబినెట్‌ మొత్తం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పని చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇలాంటి స్థాయి సమిష్టి పర్యవేక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన చెప్పారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌ సహా పలు రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అందుకు తగినట్టు వసతి, పార్కింగ్‌, రవాణా సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్‌ విషయంలో వీఐపీలు, సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం రూ.251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్‌.ఓ.డీలతో ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. పారిశుధ్యం, తాగునీరు, రవాణా, భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రధానంగా టాయిలెట్ల సంఖ్యను మరింత పెంచాలని కోరారు. జాతర సందర్భంగా గురు, శుక్ర వారాల్లోనే ప్రతి రోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారనీ, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మేడారం జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 2010 నుండి ప్రతీ సంవత్సరం వస్తున్నారని, వచ్చే వందేండ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని సీతక్క గుర్తు చేశారు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, జాతర నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అన్ని శాఖల ఉన్నతాధికారులు జాతర పనులకు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జాతర సందర్బంగా భక్తులకు చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన సూచనలపై సమాచారాన్ని అందించాలని తెలిపారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ నియంత్రణకుగాను డ్రోన్‌లను ఉపయోగించుకోవాలన్నారు. అదే విధంగా, జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్‌ను/ క్యూ.ఆర్‌ కోడ్‌ రూపొందించి ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్‌ ఏరియాల్లో కూడా ప్రత్యేకంగా వాటర్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతి రోజు తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్బంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకర పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈసారి జాతరకు దాదాపు మూడు కోట్ల మంది హాజరవుతారని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రారంభానికి ముందే 30 శాతం భక్తులు సందర్శిస్తారనీ, జాతర సమయంలో 60 శాతం నుంచి 65 శాతం వరకు, జాతర అనంతరం 5 శాతం భక్తులు సందర్శిస్తారని వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్‌, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్‌ కుమార్‌, సీఎస్‌ రామకృష్ణారావులు ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -