Tuesday, June 10, 2025
E-PAPER
Homeఆటలుషెడ్యూల్‌ మారింది!

షెడ్యూల్‌ మారింది!

- Advertisement -

– వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాతో టెస్టు వేదికల్లో మార్పు
– చెన్నై నుంచి చండీగఢ్‌కు మహిళల వన్డే సిరీస్‌
నవతెలంగాణ-ముంబయి
స్వదేశీ అంతర్జాతీయ షెడ్యూల్‌లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పలు మార్పులు చేసింది. సహజంగా క్రికెట్‌ మ్యాచుల వేదికల ఎంపిక, షెడ్యూల్‌ అంశాల్లో విమర్శలను బీసీసీఐ పట్టించుకోదు. కానీ, ఈ ఏడాది నవంబర్‌లో న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా, భారత్‌ టెస్టు మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేయగా.. అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 2017 భారత్‌, శ్రీలంక టెస్టు మ్యాచ్‌ సందర్భంగా కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. శ్రీలంక క్రికెటర్లు సహా కొందరు భారత క్రికెటర్లు మాస్క్‌లు ధరించి మైదానంలో అడుగుపెట్టారు. నవంబర్‌-డిసెంబర్‌ సమయంలో న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకునే సమయం. అయినా, అదే సమయంలో టెస్టు మ్యాచ్‌ నిర్వహణకు రంగం సిద్ధం చేయటం బీసీసీఐ ప్రణాళిక లేమి, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని తీరుకు అద్దం పట్టింది. తీవ్ర విమర్శలను పక్కనపెడితే, డిసెంబర్‌లో ఢిల్లీలో టెస్టు మ్యాచ్‌తో క్రికెటర్లు శ్వాసకోస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడటంతో పాటు అంతర్జాతీయంగా న్యూఢిల్లీ కాలుష్యం చర్చకు దారితీసే అవకాశం ఉంది. దీంతో బీసీసీఐ న్యూఢిల్లీలో జరగాల్సిన టెస్టు మ్యాచ్‌ను కోల్‌కతకు కేటాయించి.. కోల్‌కతలో జరగాల్సిన టెస్టు మ్యాచ్‌ను న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఈ మేరకు స్వదేశీ సీజన్‌ అంతర్జాతీయ షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ సైకియా సోమవారం రీ షెడ్యూల్‌ విడుదల చేశారు.
ఇటు అటు.. అటు ఇటు :
భారత్‌, వెస్టిండీస్‌ రెండు టెస్టు సిరీస్‌ అక్టోబర్‌లో ఆరంభం కానుంది. అక్టోబర్‌ 6 నుంచి జరిగే తొలి టెస్టుకు అహ్మదాబాద్‌ వేదిక కానుంది. అక్టోబర్‌ 14న మొదలయ్యే రెండో టెస్టు ఇప్పుడు న్యూఢిల్లీలో షెడ్యూల్‌ చేశారు. గతంలో ఈ టెస్టు మ్యాచ్‌ను కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌కు కేటాయించారు. భారత్‌, దక్షిణాఫ్రికా రెండు టెస్టుల సిరీస్‌ నవంబర్‌లో షురూ కానుంది. నవంబర్‌ 18 నుంచి తొలి టెస్టుకు కోల్‌కత వేదిక కానుండగా.. 26 నుంచి గువహటిలో రెండో టెస్టు జరుగనుంది. నవంబర్‌ 18న ఆరంభం కావాల్సిన తొలి టెస్టు తొలుత న్యూఢిల్లీకి కేటాయించిన సంగతి తెలిసిందే.
చెన్నై నుంచి న్యూ చంఢగీడ్‌కు : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ముంగిట టీమ్‌ ఇండియా అమ్మాయిలు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ ఆడనున్నారు. ఈ సిరీస్‌ను తొలుత చెన్నై ఎం.ఏ చిదంబరం స్టేడియంలో షెడ్యూల్‌ చేశారు. కానీ వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ కోసం చెపాక్‌ స్టేడియంలో కొత్త పిచ్‌లు తయారు చేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లను న్యూ చంఢగీడ్‌ (ముల్లాన్‌పూర్‌)లో నిర్వహించనున్నారు. తొలి రెండు వన్డేలు ముల్లాన్‌పూర్‌లో జరుగనుండగా.. మూడో వన్డేకు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికా-ఏ జట్టు నవంబర్‌లో భారత్‌కు రానుంది. భారత్‌-ఏ, దక్షిణాఫ్రికా-ఏ నాలుగు రోజుల ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌కు బెంగళూర్‌లోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ వేదికగా నిలువనుంది. ఈ గ్రౌండ్‌లో జరుగనున్న తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఇదే కానుంది. దక్షిణాఫ్రికా-ఏతో మూడు వన్డేలకు బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. అక్కడ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచులను షెడ్యూల్‌ చేశారు. దీంతో ‘ఏ’ జట్టు మ్యాచులను రాజ్‌కోట్‌కు తరలించారు. ఈ ఏడాది టీమ్‌ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మ్యాచే ఆడనుంది. డిసెంబర్‌ 6న దక్షిణాఫ్రికా, భారత్‌ మూడో వన్డే మ్యాచ్‌ విశాఖపట్నంలో జరుగనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -