డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా.కొర్ర ఈశ్వర్ లాల్..
నవతెలంగాణ – అచ్చంపేట : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సేవలు అమూల్యమైనవి, విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో అరకొర జీతాలతో సంవత్సరంలో 7 నెలలే అంతే అవకాశం ఉన్న అంకితభావంతో అహర్నిశలు శ్రమిస్తు విద్యా బోధననే వృత్తిగా స్వీకరించి బోధిస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సేవలను కొనసాగించాలని డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా.కొర్ర ఈశ్వర్ లాల్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి ఆదేశానుసారం అకాడమిక్ క్యాలెండర్ లో భాగంగా నెల 4వ తేదీ నుంచి రాష్ట్రంలోని 10 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ద్వితీయ, తృతీయ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. జులై 2 నుండి మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతాయి.
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలు జూన్ 8 నుండి పాఠాలను ప్రారంభించాయి. అయితే, ఈ డిగ్రీ కళాశాలల్లో 30 శాతం నుండి 90 శాతం వరకు బోధన అతిథి అధ్యాపకులపై ఆధారపడుతోంది. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 309 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాలలో సుమారు 42 మంది గెస్ట్ లెక్చరర్లు బోధనలో నిమగ్నమయ్యారు. నాగర్కర్నూల్ జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనూ 68 మంది పనిచేస్తున్నారు, ముఖ్యంగా జిల్లాకేంద్రంలో ఉన్న రెండు కళాశాలల్లో 50 శాతం వరకు బోధన అతిథి అధ్యాపకుల ద్వారానే కొనసాగుతోంది. అలాగే కొండనాగుల, అమ్రాబాద్ డిగ్రీ కళాశాలలో సగానికి పైగా క్లాసులు గెస్ట్ లెక్చరర్ల ద్వారానే నడుస్తున్నాయని గుర్తు చేశారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు ఫైనాన్స్ అప్రూవల్, గెస్ట్ లెక్చరర్ల నియామక నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆలస్యం కావడం తో వచ్చే నెలలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశానుసారం పేపర్లలో కళాశాలల వారిగా నోటిఫికేషన్ ఇచ్చి అప్లై చేసుకోవడానికి కొంత సమయం తీసుకుని, ఆ తర్వాత ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేసుకుని త్రీ మెన్ కమిటీతో డెమోల పేరా మరో నెల రోజుల కాలయాపన ద్వారా విద్యార్థులు చాలా సబ్జెక్ట్ ల లకు అధ్యాపకులు లేక పాఠాలు అర్థం కాక చదువుకోడానికి ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.గత ఐదారు సంవత్సరాల నుండి, గడచిన విద్య సంవత్సరంలో బోధన చేసిన గెస్ట్ లెక్చరర్ల సేవలను వెంటనే రేన్యువల్ చేయాలని తద్వారా విద్యార్థులకు సమయానుకూలంగా సిలబస్ పూర్తి చేసే అవకాశం, వారి సందేహాలను నివృత్తి చేసుకొని పరీక్షలకు ధైర్యంగా సన్నద్ధమయ్యే విధంగా ,నాణ్యమైన ఉన్నత విద్య అందేలా చూడాలని ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ఉన్నత విద్యా కమిషనర్ విద్యాశాఖ కార్యదర్శిని కోరారు.