కేరళలో 16.54లక్షలకుపైగా ఓట్ల తొలగింపు
తిరువనంతపురం : కేరళపై ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్) ప్రభావం భారీగా పడింది. సుమారు 16.54 లక్షలకుపైగా ఓటర్లను తొలగించినట్టు సీపీఐ(ఎం) ప్రతినిధి ఎం.వి.జయరాజన్ తెలిపారు. అయితే ఓట్ల తొలగింపుపై అధికారికంగా సమాచారం రావాల్సి వుంది. కేరళలో సర్ తుది జాబితా శనివారం అధికారికంగా ప్రచురించబడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రధన్ యు. కేల్కర్ తెలిపారు. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.69 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారు. వారిలో 1,38,27,319 మంది మహిళా ఓటర్లు, 1,31,26,048 మంది పురుష ఓటర్లు, 277మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 2,23,558 మంది విదేశీ ఓటర్లు, 54,110మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లు లేదా 18-19సంవత్సరాల వయస్సు గల ఓటర్ల సంఖ్య 4,24,518. 85 ఏండ్ల వయస్సు పైబడిన ఓటర్లు 2,04,608 మంది.
విభిన్న ప్రతిభావంతులు కేటగిరీలోని ఓటర్ల సంఖ్య 2,43,698.అయితే శనివారం ప్రచురించే ఈసీఐ జాబితాలో, 2025 డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేరళ రూపొందించిన ఓటర్ల జాబితా కంటే 16.54 లక్షలకు పైగా ఓటర్లు తక్కువగాఉన్నారు. కేరళ రూపొందించిన జాబితాలో 2,86,07,658 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 2025లో స్పెషల్ సమ్మరీ రివిజన్ (సర్)తో నవీకరించబడిన ఓటర్ల జాబితా కంటే ఈసీఐ తుది జాబితాలో 8.97 లక్షల మంది ఓటర్లు తక్కువగా ఉన్నారు. అక్టోబర్లో ఈసీఐ జాబితాలో 2,78,50,855మంది ఓటర్లు ఉన్నారు. ఈ గణాంకాలను అనుసరించి అర్హత కలిగిన ఓటర్లు ఈసీఐ జాబితా నుంచి తొలగించబడ్డారని స్పష్టమైందని సీపీఐ(ఎం) ప్రతినిధి ఎం.వి.జయరాజన్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 23న ఈసీఐ ప్రచురించిన ముసాయిదా సర్ జాబితాలో మొత్తం 2,54,42,352మంది ఓటర్లు ఉన్నారు.



