– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి…
నవతెలంగాణ – కామారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు , ఎన్నికల అధికారులు, ఈ ఆర్ ఓ లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఈఓ మాట్లాడుతూ ఓటరు జాబితా తయారీ ఎన్నికల వ్యవస్థకు కీలకమైన అంశమని, అందులో ఎలాంటి పొరపాట్లకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి బూత్ స్థాయిలో బాధ్యతాయుతంగా పని చేయాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. ఇందులో కేటగిరీ ఏ లో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ బి లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ సి లో 1987 నుంచి 2002 మద్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ డి లో 2002 – 2007 మధ్యలో జన్మించిన వారిగా విభజించడం జరిగిందని తెలిపారు. అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. మొదట మ్యాపింగ్ చేయబడిన కేటగిరి ఏ జాబితాను బి ఎల్ ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, తద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో నమోదు చేయబడుతుందని తెలిపారు. అనంతరం కేటగిరి సి, క్యాటగిరి డి లలోని ఓటర్లను కేటగిరి ఏ కు మ్యాపింగ్ చేయాలని, ఈ ప్రక్రియను ఎ ఈ ఆర్ఆ ఓ ల ఆధ్వర్యంలో బి ఎల్ ఓ సూపర్ వైజర్లు, బి ఎల్ ఓ లు బి ఎల్ ఓ యాప్ ద్వారా వచ్చే శనివారం నాటికి పూర్తి చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్ వైజర్లతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందని మొదట కేటగిరి ఏ ఓటరు జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించిన తర్వాత కేటగిరి సిడిలను కేటగిరి ఏ కు లింక్ చేయడం జరుగుతుందని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాలను పకడ్బందీగా తయారు చేయడం జరుగుతుందని ప్రతీ రోజు రెండు పోలింగ్ కేంద్రాల వారిగా బి ఎల్ ఓ ఎస్ మొబైల్ యాప్ ద్వారా కన్ఫామ్ చేసి వచ్చే శనివారం లోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, .డిఆర్ఓ మదన్మోహన్, ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసారథి, ఎల్లారెడ్డి తాసిల్దార్ ప్రేమ్ కుమార్, కామారెడ్డి తహసిల్దార్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.



