Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభాకర్‌రావు జీ మెయిల్‌ ఖాతాపై సిట్‌ ఆరా

ప్రభాకర్‌రావు జీ మెయిల్‌ ఖాతాపై సిట్‌ ఆరా

- Advertisement -

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిన ఫోన్‌ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను పరిశీలిస్తున్న అధికారులు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావుకు చెందిన జీమెయిల్‌, ఐ క్లౌడ్‌ ఖాతాలపై సిట్‌ అధికారులు నిశితంగా ఆరా తీస్తున్నారు. తమ కస్టడీలో ఉన్న ప్రభాకర్‌రావును సోమవారం నాలుగో రోజు కూడా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ఆరోగ్యం నలతగా ఉందని చెప్పడంతో డాక్టర్లను పిలిచి ఆయనకు పరీక్షలు జరిపారు. కాగా ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో ప్రభాకర్‌రావు ఉపయోగించిన జీమెయిల్‌ అకౌంట్‌ను అధికారులు నిశితంగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆయన మెయిల్‌ ద్వారా తెప్పించుకున్న అనేక సమాచారాన్ని అధికారులు.. ఫోన్‌ట్యాపింగ్‌ సంబంధాలపై జోడించి పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కొందరు అధికారులతో పాటు కొందరు రాజకీయ నాయకులతో జరిపిన ఈ-మెయిల్‌ సందేశాలను పరిశీలించిన సిట్‌ అధికారులు.. అందులో తమకు ఉన్న అనుమానాలను ప్రభాకర్‌రావుతో మాట్లాడి నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించారని తెలిసింది.

అలాగే సాఫ్ట్‌వేర్‌ ధ్వంసం చేయడానికి ముందు వాటిలోని అంశాలను ప్రభాకర్‌రావు కొందరు అధికారులతో కూర్చోని పరిశీలించారనే కోణంలో కూడా సిట్‌ అధికారులు ఆరా తీశారని సమాచారం. కాగా ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌తో పాటు కొన్ని హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లలో ఉన్న సమాచారంపై ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నుంచి వచ్చిన నివేదికలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారని తెలిసింది. నాలుగోరోజు దాదాపుగా ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌ దిగుమతి ఎలా జరిగింది? అందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సాఫ్ట్‌వేర్‌ దిగుమతికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులను పొందారు? తదితర అంశాలపై ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -