‘నిమ్మలు దానిమ్మలు, హంసై కోయిలలు.. తాటి బెల్లం తదైనా రొట్టె… శివ శివ నల్లికూర…’ ఇలాంటి ఎన్నో అద్భుతమైన జానపదాలు దేవకమ్మ స్వరం నుండి జాలువారుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈమె పాటలు సినిమా పాటలకు ఏమాత్రం తీసిపోవు. తనలోని సృజనాత్మకతను వెలికి తీసుకుంటూ జానపద పాటలతో తనకంటూ ఓ గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పాటలు సెన్సేషనల్గా మారాయి. ప్రజలు లక్షల్లో వీక్షిస్తున్నారు. ఇప్పుడామెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనలోని కళను సమాజం కోసం ఉపయోగిస్తున్న ఆమె పాటల ప్రయాణం నేటి మానవిలో…
దేవకమ్మ అక్షరం ముక్క చదువుకోలేదు. నిరు పేద కుటుంబం నుండి వచ్చింది. కానీ ఇవేవీ ఆమె ఎదుగుదలకు అడ్డంకి కాలేదు. నల్గొండ జిల్లా, కట్టంగూర్ మండలం, ఇస్మాయిల్ పల్లి ఆమె సొంతూరు. భార్య భర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దేవకమ్మకు చిన్నతనం నుంచి పాటలపై మక్కువ. టీవీలో, సెల్ ఫోన్లో వచ్చే పాటలు వింటూ నేర్చుకుంది. వాటిని తన మెదడులో భద్రపరచుకొని తరుచూ పాడుకుంటూ ఉండేది. కూలీకి వెళ్ళిన చోట అలసట తెలియకుండా, పని ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు పాటలు పాడుతుండేది.
ప్రజానాట్యమండలి చొరవతో..
జానపదాలకు పుట్టినిల్లు తెలంగాణ. పనితోనే జత కట్టి పాట పుట్టింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పని చేసుకుంటూ పాటలు పాడుతుంటారు. ఊర్లో నాట్లు వేస్తూ, కోతలు కోస్తూ, పెళ్లిళ్లలో నలుగు పెట్టేటపుడు, నివాళ్లిలిచ్చేటపుడు, శారీ ఫంక్షన్లలో, పండగలు.. ఇలా ప్రతి సందర్భంలోనూ దేవకమ్మ పాటలు పాడుతుండేది. ఎంతో చక్కగా పాడుతున్న ఆమె పాటలను ఆ ఊరి ప్రజలు ఫోన్లో రికార్డ్ చేసేవారు. ఆమె పాడే జానపదాలు తెలంగాణ యాసను, భాషను ప్రతిబించించేవి. అదే గ్రామానికి చెందిన ఆమె మరిది శ్రీను, శాలిగౌరారం మండలం, ఆకారం గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు ఎస్.కె లతీఫ్కు ఈ విషయాన్ని తెలియజేశారు. ‘గొంతు అద్భుతంగా ఉంది. మనం చిన్న ప్రయత్నం చేద్దాం’ అని లతీఫ్ నల్గొండ స్టూడియోలో ‘నిమ్మలు దానిమ్మలు’ అనే పాటను రికార్డింగ్ చేయించారు. దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆ పాటను లక్షల మంది వీక్షించారు. మంచి స్పందన వచ్చింది. అలా ప్రజానాట్యమండలి చొరవతో దేవకమ్మ ప్రపంచానికి పరిచయమయింది.
లక్షల్లో వ్యూస్
ఇప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, టీవీలలో.. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా దేవకమ్మ పాటలే వినిపిస్తున్నాయి. ఒక పాటను మరో పాట రికార్డులు బ్రేక్ చేస్తూ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఒకప్పుడు గ్రామానికే పరిమితమైన ఆమె నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆమె జానపదాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గంటల కొద్ది ఉపాన్యాసాలతో చెప్పలేని విషయాన్ని ఒక్క పాటతో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పవచ్చని ఈమె మరోసారి రుజువు చేస్తోంది. జానపదాలకే వన్నెతేస్తుంది. నేడు అందరూ వాడుతున్న సెల్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకు లేదు. చదవరాదు, రాయరాదు. కానీ మనం తలుచుకుంటే సాధించ లేనిది ఏమీ లేదని నిరూపించింది దేవకమ్మ.
సహకారం అందిస్తే..
‘నా పాటలకు మంచి స్పందన వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా పాడుతూనే ఉంటాను. అవకాశం వస్తే సినిమాల్లో పాడటానికి కూడా నేను సిద్ధమే. నాలాంటి వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించాలి. అప్పుడు మరింత వృద్ది లోకి రాగలుగుతాము. ఈ రంగంలో రాణించగలుగుతాము’ అంటుంది దేవకమ్మ. ఒక్క దేవకమ్మే కాదు గ్రామాల్లో అనేకమంది జానపద కళాకారులు ఉన్నారు. వారికి ప్రోత్సాహం లేకపోవడం వల్ల బయటకు రాలేని పరిస్థితిల్లో ఉన్నారు. వారిని వెలికి తీసి సహకారం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. మరుగున పడుతున్న జానపద గేయాలను, కళాకారులను ప్రోత్సహించి గ్రామాలలో దాగి ఉన్న కళాకారులను వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.
సినిమాల్లో అవకాశం ఇస్తే
నా పాటలకు మంచి క్రేజ్ వచ్చినా పారితోషి మాత్రం నామమాత్రంగా ఉంది. నాకు అవకాశం దొరికితే సినిమాల్లో పాడాలని ఉంది. పాటలు పాడటానికి, నటించడానికి, ఇతర ప్రయివేటు పాటలు ఏవైనా పాటడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరింత నైపుణ్యాన్ని పెంచుకొని నా పాటల ద్వారా ప్రజలకు చేరువైతా. జానపద పాటలను జనంలోకి తీసుకు వెళ్తా. గ్రామీణ కళాకారులును ప్రభుత్వంతో పాటు సినిమా వాళ్లు ప్రోత్సహించాలి.
– గడగోజు రవీంద్ర చారి
9848772232