Friday, May 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభూముల ధరల పెంపునకు రంగం సిద్ధం

భూముల ధరల పెంపునకు రంగం సిద్ధం

- Advertisement -

– 50 నుంచి 60 శాతం పెంపునకు ప్రతిపాదనలు
– రిజిస్ట్రేషన్‌ చార్జీలు సైతం 2 నుంచి 3 శాతం పెంచేందుకు నిర్ణయం
– మార్కెట్‌ వాల్యూ రివిజన్‌ కమిటీ ప్రతిపాదనలకు సర్కార్‌ ఓకే
– జూన్‌ చివర్లో అందుబాటులోకి రానున్న కొత్త ధరలు
– ప్రభుత్వానికి అదనంగా రూ.10 వేల కోట్ల ఆదాయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. గతేడాది ఆగస్టు ఒకటి నుంచి ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినా, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా బదిలీలు జరగడం, హైడ్రా కూల్చివేతల పరిణామాల నేపథ్యంలో వెనకడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ పెంపుపై సర్కార్‌ సూచనలకనుగుణంగా మార్కెట్‌ వాల్యూ రివిజన్‌ కమిటీలు సగటున 50 నుంచి 60 శాతం పెంపునకు 2024లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖపై జరిగిన సమీక్షలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి రేట్ల పెంపునకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు సమాచారం. సర్కార్‌ ఆదేశాలకనుగుణంగా జూన్‌ చివరి వరకు భూముల ధరలతో పాటు, రిజిస్ట్రేషన్‌ ఫీజును సైతం పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2021 జులైలో ఒక సారి, 2022 ఫిబ్రవరిలో రెండోసారీ భూములు, భవనాల మార్కెట్‌ ధరలను ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచింది. రాష్ట్రం ఏర్పడక ముందున్న ధరలతోపాటు రెండు సార్లు పెంచిన సగటుతో పోల్చితే వ్యవసాయ భూముల ధరలు గరిష్టంగా 150 శాతం పెరగగా, స్థిరాస్తి భూముల ధరలు వంద శాతం, అపార్ట్‌మెంట్‌ ధరలు 50 నుంచి 80 శాతం వరకు పెరిగాయి. ఫలితంగా సర్కార్‌కు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5,243.28 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.7,000 కోట్లకుపైగా పెరిగి 2021-22 ఏడాదిలో రూ.12,372.73 కోట్లకు చేరింది. అనంతరం 2022లో రెండోసారి పెంచిన భూముల ధరలతో రూ.3,000 కోట్ల వరకు ఖజానాకు అదనపు ఆదాయం వచ్చింది. వాస్తవానికి ప్రతి ఏడాది మార్కెట్‌ ధరలు సమీక్షించి సవరించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. కాని గత సర్కార్‌ ఆ పని చేయలేదు. ఫలితంగా మార్కెట్లో పెరుగుతున్న ధరలకు సర్కార్‌ నిర్ణయించిన ధరలకు మధ్య వ్యత్యాసం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత 2024లో భూముల ధరలను పెంచాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా మార్కెట్‌ వాల్యూ రివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆర్టీవో చైర్మెన్‌గా, సబ్‌ రిజిస్ట్రార్‌ కన్వీనర్‌గా ఐదుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీలు క్షేత్రస్థాయిలో రాష్ట్రమంతా పర్యటించి భూముల విలువ పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. జూన్‌ 2024లో పెంపుపై తయారు చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఆగస్టు 1 నుంచే పెంచాలని నిర్ణయించినా రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా బదిలీలు జరగడం, హైడ్రా కూల్చివేతల పరిణామాల నేపథ్యంలో ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24లో రూ. 14,558 కోట్లు, 2024-25లో రూ.14,307 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే గతేడాది కంటే రూ.251 కోట్ల ఆదాయం తగ్గిందన్నమాట. ఆ శాఖ పెట్టుకున్న లక్ష్యంతో చూస్తే మాత్రం దాదాపు రూ.4 వేల కోట్ల రాబడి పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న లిక్కర్‌, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గతేడాది కంటే తగ్గడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భూముల, ధరలతో పాటు రిజిస్ట్రేషన్ల ఫీజును సైతం ఒకే సారి పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జూన్‌ చివరి వారంలో పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

రిజిస్ట్రేషన్‌ ఫీజు సైతం..
రాష్ట్రంలో భూముల ధరలతోపాటు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ ఫీజును 2 నుంచి 3 శాతం పెంచాలని సర్కార్‌ నిర్ణయించింది. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజును 2021లో పెంచింది. నాలుగు శాతం ఉన్న ఫీజును 5.5 శాతానికి పెంచారు. అనంతరం మరోసారి 2 శాతం పెంచారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ఫీజు మొత్తంగా 7.5 శాతానికి చేరుకుంది. ఇందులో 5.5 శాతం స్టాంప్‌ డ్యూటీ కాగా, 0.5 శాతం ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, 1.5 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. 2021లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా పెంచారు. అదే పద్ధతిని ప్రస్తుతం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
అదనంగా రూ.10 వేల కోట్ల ఆదాయం
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2015-16లో రూ. 3,105, 2016-17లో రూ3,821.66 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత 2019-20 వరకు వరు సగా ఏటా వెయ్యి కోట్ల వరకు పెరిగి రూ.6,671.05 కోట్లకు చేరింది. అయితే ఆ మరుసటి ఏడాది 2020-21లో దాదాపు రూ.1300 కోట్లు తగ్గిం ది. దాంతో అప్పటి సర్కార్‌ భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజును పెంచిం ది. ఫలితంగా 2021-22లో 12,372.73 కోట్లకు చేరింది. ఆ తర్వాత రెండేండ్లు మరో రూ. రెండు వేల కోట్ల పెరుగుదలను నమోదు చేసి 2023-24లో రూ. 14,558 కోట్లు, 2024-25లో రూ.14,307 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే గతేడాది కంటే రూ.251 కోట్ల ఆదాయం తగ్గింది. ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల బెంచ్‌ మార్క్‌ చేరుకోవాలని సర్కార్‌ లక్ష్యంగా నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -