Sunday, July 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువచ్చే ఏడాది కాజీపేట ఆర్‌ఎంయూ ప్రారంభం

వచ్చే ఏడాది కాజీపేట ఆర్‌ఎంయూ ప్రారంభం

- Advertisement -

కోచ్‌లు, ఇంజిన్‌లు, మెట్రో రైళ్ల తయారీ
కెేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌
ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కల సాకారం : కేంద్ర బొగ్గు, గనులశాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

కాజీపేటలో నిర్మిస్తున్న నూతన అత్యాధునిక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)లో 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర రైల్వేశాఖామంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. మరో మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన శనివారం మధ్యాహ్నం ఆర్‌ఎంయూ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ రూ.500 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామనీ, ఈ ఏడాది డిసెంబర్‌లో పు సివిల్‌ వర్క్స్‌ పూర్తవుతాయని చెప్పారు. ఇక్కడ రైల్వే కోచ్‌లు, ఇంజిన్‌లు, మెట్రో కోచ్‌లు, వ్యాగన్‌లు తయారవుతాయన్నారు. వందేభారత్‌ రైల్వే కోచ్‌లకు డిమాండ్‌ అధికంగా వుందని, ఇప్పటికే 150 వందేభారత్‌ కోచ్‌ల ఎగుమతులకు సంబంధించిన ఆర్డర్‌లు వచ్చాయని తెలిపారు. మెట్రో కోచ్‌ల ఎగుమతుల కోసం కూడా ఆర్డర్‌లు వచ్చాయన్నారు. కాజీపేట ఆర్‌ఎంయూలో 4 విశాలమైన బే 1, బే 2, బే 3, బే 4లను నిర్మించారన్నారు.

40 ఏండ్ల కల సాకారమవుతోంది : మంత్రి జి.కిషన్‌రెడ్డి
కాజీపేటలో ఆర్‌ఎంయూ 40 ఏండ్ల కల అని, ప్రాజెక్టు నిర్మాణంతో ఆ కల సాకారమవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖామంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ అనేక దశాబ్దాల ప్రజల కల అని అన్నారు.
మాజీ ప్రధాని నర్సింహారావు హయాంలో కూడా ఈ కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయన్నారు. మోడీ ప్రధాని అయ్యాక కాజీపేటలో రైల్వే ఇంజిన్లు, కోచ్‌లు, వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించి నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు.
ఈ యూనిట్‌ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఇందులో వరంగల్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఉందన్నారు. వరంగల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం సగం పూర్తయిందన్నారు.

మామునూరు ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ పూర్తి చేయాలి
వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి భూ సేకరణ సత్వరమే పూర్తి చేస్తే వెంటనే పనులు చేపడుతామని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్‌కు అనేకమార్లు లేఖలు రాశానన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కూడా విన్నవించినట్టు చెప్పారు. కాజీపేట ఆర్‌ఎంయూ యూనిట్‌కు భూములు ఇచ్చిన స్థానికులకు సంబంధించి ఉద్యోగావకాశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్‌ బాధ్యత తీసుకోవాలని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. స్థానికులకు ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, ఎం.ధర్మారావు, జి.విజయరామారావు, రావు పద్మ తదితరులున్నారు.

మంత్రికి భూనిర్వాసితుల వినతి
భూ నిర్వాసితులు రైల్వే మంత్రిని కలిసి ఉద్యోగావకాశాలు ఇవ్వాలని కోరారు. అయితే, రైల్వే జాక్‌ నేతలు మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి మెమోరాండం ఇవ్వడానికి గంటల తరబడి వేచి చూసినా ఫలితం లేకపోయింది. రైల్వే అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -