రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
హర్యానాలో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఘటనపై ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హర్యానాలో ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనను సుప్రీకోర్టు సుమోటోగా తీసుకోవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. గురువారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. ”ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి, రాజ్యాంగం అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తిపైనే కుల వివక్ష, హింస, అవమానం జరుగుతుంటే, ఈ దేశంలో సామాన్య దళితులు, గిరిజనలు, పేదలు, కార్మికులు ఏ రక్షణలో ఉన్నారు? ఇది దేశపు లౌకిక, రాజ్యాంగ విలువలపై బహిరంగ దాడి” అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన యాదృచ్ఛికం కాదనీ, ఇది మనువాద పాలనకు ప్రతిబింబమని విమర్శిం చారు. బీజేపీ పాలనలో ఆధిపత్య కులాలు పోలీసు-న్యాయ వ్యవస్థల్లో, పరిపాలనలో తెగబడి, దళిత అధికారులపై, ప్రజా ప్రతినిధులపై దాడులు చేయడం రోజువారీ వ్యవహార మైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనువాదులు అధికారంలో ఉండగానే రాజ్యాంగం బలహీనమవుతుందని అన్నారు.
డిమాండ్లు
- దళిత అధికారి మరణంపై సుప్రీంకోర్టు తక్షణంగా సుమోటోగా విచారణ ప్రారంభించాలి.
- భారత రాష్ట్రపతి దేశ రాజ్యాంగాధ్యక్షురాలిగా తక్షణ జోక్యం చేసుకొని న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- ఆ అధికారి రాసిన 9 పేజీల సూసైడ్ నోట్ వెంటనే బహిరంగ పరచాలి.
- ఆ నోట్లో పేరుకెక్కిన అధికారులను, రాజకీయ నాయకులను వారి పదవుల నుంచి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలి. వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
- హర్యానా ప్రభుత్వం, బీజేపీ కేంద్ర పాలకులు బాధ్యత వహించాలి.
- ఎస్సీ కమిషన్ వెంటనే అన్ని చర్యలూ తీసుకోవాలి.