పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి ఎంత నిజమో కొందరికి పేర్లు కూడా అలాగే నప్పుతాయి అనటంలో అతిశయోక్తి లేదు. తల్లి తండ్రులకు తమ బిడ్డ ప్రముఖ గాయని అవుతుందని ముందుగానే తెలుసేమో తమ ఏకైక కుమార్తెకు గీత మాధురి అని పేరు పెట్టారు. ఎంతో మాధుర్యవంతమైన గీతాలను ఆలపించి దాదాపు అన్ని దక్షిణ భారత దేశ భాషల్లో వందలకొద్ది పాటలు పాడి శ్రేయ ఘోషాల్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరు పొందారు. ఎన్నో పాటలు పాడి అనేక పురస్కారాలు అందుకున్న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
తెలుగు స్టార్ సింగర్స్లో శొంఠి గీతా మాధురి కూడా ఒకరు. తన శ్రావ్యమైన గొంతుతో ఎన్నో హిట్ పాటలను పాడి సంగీత ప్రేక్షకులను అలరించారు ఆమె. గానంతో పాటు కంపోజింగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ రాణిస్తున్నారు. ఎందరో హీరోయిన్లు, ఇతర మహిళా నటులకు ఆమె గాత్రదానం చేశారు. ఇండిస్టీలోకి ఎంత మంది సింగర్స్ వచ్చినా.. ఆమె మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. భిన్నమైన స్వరంతో ఫాస్ట్ పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
చిన్నతనంలోనే…
గీతా మాధురి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆగస్టు 24న పుట్టారు. తల్లి లక్ష్మి, తండ్రి ప్రభాకర్. వీరికి గీత ఏకైక సంతానం. ఆమె చిన్న వయసులోనే తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. దాంతో గీత చదువంతా నగరంలోనే సాగింది. వనస్థలిపురంలోని లయోలా పాఠశాలలో ఆమె చదువుకున్నారు. చిన్నప్పటి నుండే ఆమె సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు. ఈటీవీలో ప్రసారమైన ‘సూపర్ సింగర్స్ ఛాలెంజ్’లో ఆమె ఫైనలిస్ట్గా నిలిచారు. అప్పటి నుండే ఆమెకు సినిమాల్లో అవకాశాలు మొదలయ్యాయి.
తొలి అవకాశం
బీకాం చదువుకున్న గీతా మాధురి.. కులశేఖర్ దర్శకత్వం వహించిన ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాలో గాయనీగా మొదటిసారి పాట పాడారు. అయితే 2007లో ‘చిరుత’ చిత్రంలోని ‘చమ్కా చమ్కా’ అనే సాంగ్ ఆమెకు గాయనిగా స్టార్ డమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మగధీరలో ధీర ధీర, గోలీమార్లోని మగాళ్లు ఒట్టి మాయగాళ్లు అనే పాటలతో గీత పేరు టాలీవుడ్లో మారుమోగింది. 20 ఏండ్ల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 2300కు పైగా పాటలు పాడారు గీతా మాధురి.
నందూతో పెండ్లి
యువ నటుడు నందూను ప్రేమించిన గీతా మాధురి పెద్దల అంగీకారంతో 2014లో పెండ్లి చేసుకున్నారు. వీరికి పాప దాక్షాయణి, కొడుకు ధృవధీర్ తారక్ పుట్టారు. నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని ఎంజారు చేస్తోంది ఈ జంట. నందూ 100% లవ్ సినిమాలో అజిత్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నందూ, గీతామాధిరి కలిసి ‘అదితి’ అనే షార్ట్ ఫిలింలో నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం నందూ సినిమాల్లో రాణిస్తుండగా.. గీతా మాధురి పాటలు పాడటంతో పాటు టెలివిజన్, ఓటీటీలోని పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సింగర్గా తన పాపులారిటీతో బిగ్బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్గా రాణించడంతో పాటు రన్నరప్గా నిలిచారు.
దేశ విదేశాల్లో…
గీతామాధురి మన దేశంతో పాటు సింగపూర్, లండన్, అమెరికా, దుబారు వంటి దేశాలలో అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి మన తెలుగు ప్రజల మనసు దోచుకున్నారు. మనో, చిత్ర, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎం.ఎం.కీరవాణితో పాటు అనేక మంది ప్రముఖ భారతీయ గాయకులతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే స్వరాభిషేకం, మాటీవీ, సూపర్ సింగర్ సెవెన్, సూపర్ మస్తీ వంటి ప్రసిద్ధ తెలుగు కార్యక్రమంలో కనిపించారు. ఆమె దక్షిణ భారత దేశంలో ఇప్పటివరకు 550 సినిమా, ఆల్బమ్ పాటలు విడుదల చేశారు.
మోస్ట్ వాటెండ్ సింగర్గా…
నచ్చావులే, గుడ్ మార్నింగ్ సినిమాలకు గాను గీతా మాధురికి నంది అవార్డ్స్ వరించాయి. నచ్చావులే, గోలీమార్, గుండెల్లో గోదావరి, బాహుబలి ది బిగినింగ్, మహానుభావుడు చిత్రాలకు ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్నారు. ఇవి కాక మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి అవార్డులు, రివార్డులను పొందారు ఈ స్టార్ సింగర్. ఇప్పటికీ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ సింగర్గా.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ పొందే సింగర్గానూ గుర్తింపు తెచ్చుకున్నారు.
– పాలపర్తి సంధ్యారాణి